కరీంనగర్ కళోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-10-01T09:05:54+05:30 IST
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘కరీంనగర్ కళోత్సవాలు’ శుక్రవారం అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ప్రారంభించిన స్పీకర్.. మూడు రోజుల పాటు నిర్వహణ
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 30: కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘కరీంనగర్ కళోత్సవాలు’ శుక్రవారం అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కళోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రాకర్ షో అహూతులను అలరించింది. కేసీఆర్పై చిత్రీకరించిన పాటతో ప్రారంభమైన వేడుకలకు యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విదేశాలతో పాటు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. రాష్ర్టానికి చెందిన కళాకారులు మిట్టపెల్లి సురేందర్, మధుప్రియ, నాగదుర్గ, మౌనికా యాదవ్, బుల్లెట్ భాస్కర్, నరేశ్, జాను లిరి, శేఖర్, జోగుల వెంకటేశ్, నక్క శ్రీకాంత్, చంద్రవ్వ, కొమురవ్వ తమ ప్రదర్శనలతో అలరించారు. సినీనటులు శ్రీకాంత్, తరుణ్, రోజారమణి హాజరై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వేడుకలను తిలకించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కళోత్సవాల నిర్వాహకుడు, మంత్రి గంగుల కమలాకర్ను ప్రత్యేకంగా అభినందించారు. తార ఆర్ట్స్ అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.