కంగారూలదే టీ-20 సిరీస్
ABN , First Publish Date - 2020-09-28T10:55:39+05:30 IST
సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం ..
ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన హీలీ
బ్రిస్బేన్: సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకొంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కంగారూలు 8 వికెట్లతో కివీస్పై విజయం సాధించి.. 2-0తో సిరీస్ దక్కించుకున్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్గా అలీసా హీలీ (92).. ధోనీ (91) రికార్డును బ్రేక్ చేసింది.
తొలుత ఆసీస్ బౌలర్ల విజృంభణతో కివీస్ 19.2 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. అమీ సాటెర్త్వైట్ (30), సుజీ బేట్స్ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. డెలిసా (3/21), జార్జియా (3/26) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రేచల్ హైనెస్ (40 నాటౌట్), అలీసా హీలీ (33), కెప్టెన్ మెగ్లానింగ్ (26 నాటౌట్), బేత్ మూనీ (24) రాణించడంతో ఆసీస్ 16.4 ఓవర్లలో 129/2 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. 30న ఆఖరి, మూడో టీ20 జరగనుంది.