ఏపీలో ఆర్థిక దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి: కనకమేడల
ABN , First Publish Date - 2021-12-02T20:49:58+05:30 IST
జగన్ విధానాల వల్లే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కనకమేడల విమర్శించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని పార్లమెంట్లో వైసీపీ ఎంపీ భరత్ చెప్పారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్ర కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఏపీలో ఆర్థిక దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ఈ ఆర్థిక పరిస్థితి అని సభను తప్పుదారి పట్టించారన్నారు. 63 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 3 లక్షల 14 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని, జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ. 3 లక్షల 8 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి గ్రామ పంచాయతీల నిధుల్ని డైవర్ట్ చేశారని కనకమేడల విమర్శించారు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చే నిధుల్ని దారి మళ్లించారన్నారు. విద్యుత్ సంస్థలకు బకాయిలు కూడా చెల్లించడం లేదని, అప్పులన్నీ వైసీపీ ప్రభుత్వం చేసి చంద్రబాబుపైకి నెట్టడమేంటని ప్రశ్నించారు. తాము చెప్పే లెక్కలు అవాస్తవమైతే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ విధానాల వల్లే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. అమరావతి ప్రాజెక్టును అర్థాంతరంగా ఆపడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కనకమేడల అన్నారు.