సీమ గొంతు కోస్తున్న జగన్‌

ABN , First Publish Date - 2021-06-11T09:23:21+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ గొంతు కోస్తున్నారు. సీమ ప్రాంతానికి సాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పడేసింది

సీమ గొంతు కోస్తున్న జగన్‌

సాగు ప్రాజెక్టులను పక్కన పడేశారు: కాల్వ


అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ గొంతు కోస్తున్నారు. సీమ ప్రాంతానికి సాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పడేసింది. సీమ బిడ్డ అని చెప్పుకొనే నైతిక హక్కును ముఖ్యమంత్రి కోల్పోయారు’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవోలు, ప్రకటనల పేరుతో ఊరించడం తప్ప ఈ రెండేళ్లలో సీమకు చెందిన ఒక్క ప్రాజెక్టూ పురోగతికి నోచుకోలేదన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం 62 ప్రాజెక్టులు చేపట్టి అందులో ఇరవై మూడింటిని పూర్తి చేసింది. వీటిపై ఐదేళ్లలో రూ.65 వేల కోట్లు వ్యయం చేసింది. వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఏడాదికి రూ.1,000 కోట్లు కూడా పనులపై ఖర్చు చేయలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 30 ఏళ్లు పడుతుంది. 42 ప్రాజెక్టులు చేపడుతున్నామని ఘనంగా చెప్పారు. అవి పూర్తి కావడానికి ఇప్పటి ధరల్లో రూ.లక్ష కోట్లు కావాలి. హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వెలిగొండ మొదటి టన్నెల్‌ ఏడాదిలో పూర్తి చేస్తామని 2019 బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఇంతవరకూ పట్టించుకోలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా కనీసం రూ.500 కోట్లయినా ఖర్చు చేసిన పాపాన పోలేదు’’ అని విమర్శించారు. పెద్ద హడావిడి చేసి, రూ.14 వేల కోట్లతో నిర్మిస్తున్నామంటూ జీవోకూడా ఇచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ వివాదాలు తప్ప, పనులు మాత్రం మొదలు కాలేదన్నారు. ఎగువ రాష్ట్రాలు తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని నీటిని వాడుకోవడానికి పరుగులు తీస్తుంటే... జగన్‌ ప్రభుత్వం మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుందన్నారు. ఇదే ధోరణి కొనసాగితే చరిత్రలో ఈ ప్రభుత్వం రైతు ద్రోహిగా మిగిలిపోతుందని కాల్వ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-11T09:23:21+05:30 IST