న్యాయవ్యవస్థను కించపరిచే వారిని కట్టడి చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-05-31T08:49:23+05:30 IST

న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిని కట్టడి చేయాల్సిందేనని, వీరిపై సుప్రీంకోర్టు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే

న్యాయవ్యవస్థను కించపరిచే వారిని కట్టడి చేయాల్సిందే

  • ఇది.. వాక్‌ స్వాతంత్య్రం దుర్వినియోగమే
  • సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సాల్వే

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిని కట్టడి చేయాల్సిందేనని, వీరిపై సుప్రీంకోర్టు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే అభిప్రాయపడ్డారు. ఓ వెబ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. న్యాయస్థానం ఇచ్చే తీర్పులను తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని నియంత్రించాల్సిందేనని చెప్పారు. వాక్‌ స్వాతంత్య్రం పేరుతో కోర్టులపై హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని అదుపు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు మీడియా ద్వారా తెలుసుకున్నానని, ఆ వ్యాఖ్యలను తాను కూడా పరిశీలించినట్టు తెలిపారు. ‘‘అసలు జడ్జీలెవరు? ఇందులో జోక్యం చేసుకోవడానికి మీకెంత ధైర్యం? జడ్జీలను కరోనా రోగితో కలిపి గదిలో బంధించాలి. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం’’ అంటూ తీవ్ర పదజాలాన్ని ప్రయోగించారని, ఇది కేవలం పదజాలానికి సంబంధించిన అంశం కాదన్నారు. న్యాయవ్యవస్థనే సవాల్‌ చేసే ఈ విధానం ఏమాత్రం ముమ్మాటికీ సరికాదన్నారు.

Updated Date - 2020-05-31T08:49:23+05:30 IST