ద్రోహుల ఆటలు సాగవు: వల్లూరు
ABN , First Publish Date - 2022-01-27T08:37:27+05:30 IST
ద్రోహుల ఆటలు సాగవు: వల్లూరు
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ సరిహద్దుల్లో వీర మరణం పొందిన బాపట్ల సైనికుడు జస్వంత్ రెడ్డికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శౌర్య చక్ర ఇచ్చి సెల్యూట్ చేస్తోంది. ఇక్కడేమో వైసీపీ ప్రభుత్వం శత్రు దేశ జాతిపిత జిన్నా పేరుతో ఉన్న టవర్కు పోలీసులను కాపలా పెట్టింది. ఇది ఏ విధమైన దేశభక్తి?’’ అని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా బాధ్యుడు జయప్రకాశ్ నారాయణ వల్లూరు నిలదీశారు. జిన్నా టవర్కు ప్రభుత్వమే అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవరం రోజు జాతీయ జెండాను గుంటూరు నడిబొడ్డున జిన్నా టవర్పై ఎగుర వేసేందుకు వెళుతున్న బీజేపీ నేతలు, హిందూ వాహిని ప్రతినిధులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేయడాన్ని జేపీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘కర్నూలు జిల్లా ఆత్మకూరులో టెర్రరిస్టు సంస్థలతో పోరాడేందుకు ప్రయత్నించిన దేశ భక్తులైన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెడతారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున దేశ ద్రోహి పేరుతో ఉన్న టవర్ పేరు మార్చబోమంటారు. ఇంతకూ ఏపీలో ఏ విధమైన పాలన సాగించాలనుకొంటున్నారు? బీజేపీ ఇవన్నీ చూస్తూ ఊరుకోదు. దేశ ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని జేపీ వల్లూరు హెచ్చరించారు.