ఎక్సర్సైజ్ సేవలకుగానూ ఆయనకు టికెట్ ఇచ్చారు: జవహర్
ABN , First Publish Date - 2021-03-27T20:51:52+05:30 IST
సీఎం జగన్రెడ్డి కాళ్లకు ఎక్సర్సైజ్ సేవలకు గురుమూర్తికి టికెట్ ఇచ్చారని కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు.
అమరావతి: సీఎం జగన్రెడ్డి కాళ్లకు ఎక్సర్సైజ్ సేవలకుగానూ గురుమూర్తికి తిరుపతి టికెట్ ఇచ్చారని కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికలో దుర్గాప్రసాద్ భార్య, కొడుకుకు గానీ ఎంపీ సీటు ఇవ్వకుండా జగన్రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. కరోనా పేషంట్లకు సేవలు చేసిన డాక్టర్ సుధాకర్ను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై దాడి చేశారని ధ్వజమెత్తారు. నందిగం సురేష్ను ఎంపీ చేసి.. ఆయనను ఇసుక మాఫియాగా మార్చారని చెప్పారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న 2 లక్షల దళితులను బికారులుగా చేశారన్నారు. ఇదేనా దళిత ఉద్ధరణా? జగన్రెడ్డి అని ప్రశ్నించారు. జగన్ అండ్ కో మోసాలను దళితులు అర్ధం చేసుకుని తిరుపతి ఉప ఎన్నికలో బుద్ది చెప్పాలని జవహర్ పేర్కొన్నారు.