వివాదంలో జడేజా దంపతులు

ABN , First Publish Date - 2020-08-12T09:12:40+05:30 IST

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, అతడి భార్య రీవా వివాదంలో చిక్కుకున్నారు. రీవాను మాస్క్‌ ధరించమని అడిగినందుకు..

వివాదంలో జడేజా దంపతులు

మాస్క్‌ పెట్టుకోమన్నందుకు మహిళా పోలీసుతో వాగ్వాదం

రాజ్‌కోట్‌: టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, అతడి భార్య రీవా వివాదంలో చిక్కుకున్నారు. రీవాను మాస్క్‌ ధరించమని అడిగినందుకు దంపతులిద్దరూ మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగిన ఘటన రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి జరిగింది. భార్యతో కలిసి జడేజా కారులో వెళ్తుండగా.. వాహన తనిఖీల్లో భాగంగా మహిళా కానిస్టేబుల్‌ సోనాల్‌ గోసాయ్‌ కారును ఆపింది. ఆ సమయంలో జడేజా మాస్క్‌ ధరించి ఉండగా.. రీవాకు మాత్రం మాస్క్‌ లేదు. దీంతో జరిమానా చెల్లించాలని సోనాల్‌ అనడంతో ఆమెతో రీవా వాగ్వాదానికి దిగింది. జడేజా కూడా భార్యకు మద్దతుగా మహిళా పోలీసుతో గొడవ పడ్డాడని తెలిసింది. ఘటన జరిగినప్పుడు జడేజా భార్య మాస్క్‌ ధరించలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని డిప్యూటీ పోలీసు కమిషనర్‌ మనోహర్‌ సిన్హా జడేజా వెల్లడించారు. కాగా.. జడేజా భార్య రీవా గతంలోనూ ఓసారి పోలీసులతో గొడవ పడింది. రెండేళ్ల క్రితం రోడ్డుపై కారులో వెళుతూ ఓ కానిస్టేబుల్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఆ వివాదంలో తనపై దూషణకు దిగడంతో సదరు కానిస్టేబుల్‌ రీవా చెంపపై కొట్టాడు. రీవా ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడంతో పాటు సస్పెండ్‌ కూడా చేశారు. కాగా, రీవా గతేడాది బీజేపీలో చేరిన  విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-12T09:12:40+05:30 IST