సినిమా టికెట్ ధరల పెంపునకు ఓకే
ABN , First Publish Date - 2021-12-24T08:31:00+05:30 IST
పొరుగునున్న ఏపీ సర్కారు సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గిస్టే.. మన రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- అనుమతిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ
- అధికారుల కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం
- ఏసీ థియేటర్లలో కనిష్ఠం రూ. 50.. గరిష్ఠం 150
- మల్టీప్లెక్స్ల్లో కనిష్ఠం రూ.100.. గరిష్ఠం రూ.250
- మల్టీప్లెక్స్ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300
- టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పొరుగునున్న ఏపీ సర్కారు సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గిస్టే.. మన రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులపై భారీగా భారం పడబోతోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరుతూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్ ధరల ఖరారుకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.
సినీరంగ ప్రముఖులతో పలుదఫాలు చర్చలు జరిపిన అధికారుల కమిటీ చేసిన సిఫారసుల మేరకుప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే, టికెట్లపై జీఎ్సటీ, నిర్వహణ చార్జీలు, ఆన్లైన్ చార్జీలకు సంబంధించిన వివరాలను వేర్వేరుగా ప్రింట్ చేయాలని సూచించింది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్ పై రూ.5, నాన్-ఏసీలో టికెట్పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇవన్నీ కలిస్తే తడిసి మోపెడైన చందంగా.. ప్రేక్షకులపై భారీగా భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆన్లైన్లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయట్లేదు. టికెట్ ధర రూ.200గా ఉంటే, ఆన్లైన్లో దానికి అదనంగా కన్వీనియెన్స్ ఫీ కింద రూ.25.31 వసూలు చేస్తున్నారు. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్ల్లో గరిష్ఠ ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్లైన్ టికెటింగ్ వసూలు చేసే కన్వీనియెన్స్ రుసుము, నిర్వహణ చార్జీలు కలుస్తాయి. దీంతో టికెట్ ధర భారీగా పెరిగిపోతుంది. నేరుగా థియేటర్లలో టికెట్ కొంటే కన్వీనియెన్స్ రుసుము తగ్గుతుందిగానీ.. జీఎస్టీ, నిర్వహణ చార్జీల భారం అలాగే ఉంటుంది.