రద్దీ ఉంది.... రాకండి
ABN , First Publish Date - 2022-05-29T09:03:20+05:30 IST
రద్దీ ఉంది.... రాకండి
వీఐపీలకు, భక్తులకు టీటీడీ ఈవో విజ్ఞప్తి
రద్దీ తగ్గే వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
సర్వదర్శనానికి 48 గంటల సమయం
తిరుమల, మే 28 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొందని, తగ్గేవరకు వీఐపీలతో పాటు భక్తులు కూడా తమ పర్యటన వాయిదా వేసుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొండపై ఉన్న భక్తులకు దర్శనానికి రెండురోజుల సమయం పడుతుందని చెప్పారు. రద్దీ తగ్గే దాకా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన క్యూలైన్లను అఽధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, గరుడసేవ సమయాలకంటే అధిక రద్దీ నెలకొందని పేర్కొన్నారు. తాము గంటకు 4,500 మందికి మాత్రమే దర్శనం చేయించగలమని, దయచేసి భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తిచేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కాగా.. వేసవి సెలవుల నేపథ్యంలో శనివారం మఽధ్యాహ్నం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోవడంతో పాటు క్యూలైన్ లేపాక్షి మీదుగా అన్నదానం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 48 గంటల తర్వాత దర్శనం లభిస్తున్నట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. శ్రీవారి ఆలయంతో పాటు, మాడవీధులు, కాటేజీలు, అఖిలాండం లడ్డూకౌంటర్, అన్నదానం కాంప్లెక్స్, రోడ్లు, బస్డాండ్ యాత్రికులతో కిటకిలాడుతోంది.