ఐసొలేషన్ ముందే ఆగిన ఊపిరి!
ABN , First Publish Date - 2020-08-15T10:45:49+05:30 IST
మూడు రోజులుగా జ్వరం. దానికితోడు ఆయాసం. కరోనా పరీక్షల కోసం రెండు గంటలు.. అంబులెన్సు కోసం ..
కరోనా పరీక్షల కోసం రెండు గంటలు
అంబులెన్స్ కోసం మరో 2 గంటలు
తీరా ఆస్పత్రికి వెళితే అందని వైద్యం
చికిత్స కోసం నిరీక్షిస్తుండగానే మృతి
శ్రీకాళహస్తి, ఆగస్టు14: మూడు రోజులుగా జ్వరం. దానికితోడు ఆయాసం. కరోనా పరీక్షల కోసం రెండు గంటలు.. అంబులెన్సు కోసం మరో రెండు గంటలు పడిగాపులు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా పట్టించుకునే వారే లేరు. చికిత్స కోసం ఐసోలేషన్ వార్డు ముందే నిరీక్షిస్తూ తుదిశ్వాస విడిచాడు మతిస్థిమితం లేని వెంకటేశ్. కళ్లముందే కన్నకొడుకు ప్రాణాలు విడవడంతో ఆ కన్నతల్లి గుండెలవిసేలా రోదించింది. ఈ హృదయవిదారక సంఘటన శ్రీకాళహస్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం బహదూర్పేట నల్లగంగమ్మ ఆలయం సమీపంలోని జయరామయ్య, సంజీవమ్మ దంపతుల కుమారుడు వి.వెంకటేశ్ (38)కు మతిస్థిమితం లేదు. ఆయనకు మూడు రోజులుగా జ్వరం వస్తుంటే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గలేదు. ఆయాసం కూడా పెరిగిపోవడంతో ఏఎన్ఎం సూచనమేరకు కరోనా పరీక్షలకు సిద్ధమయ్యారు. శుక్రవారం గోపాలవనం ప్రాంతంలో సంజీవని బస్సు వద్దకు సరోజమ్మ కుమారుడిని తీసుకొచ్చారు. క్యూ ఎక్కువగా ఉండటంతో పరీక్షలకు రెండు గంటలు పట్టింది. దీంతో నీరసం ఎక్కువై వెంకటేశ్ అక్కడే పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆటో వాళ్లెవరూ ముందుకు రాలేదు. 108కు ఫోన్చేస్తే శ్రీకాళహస్తిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.. తాము రాలేమని తేల్చి చెప్పారు.
బుచ్చినాయుడు కండ్రిగలోని 108కు సమాచారమివ్వగా వాళ్లు వచ్చేసరికి 2గంటలు పట్టింది. వారు వెంకటేశ్ను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డు ముందు వదిలి వెళ్లిపోయారు. తన కుమారుడికి వెంటనే చికిత్స అందించాలని సరోజమ్మ వైద్య సిబ్బందిని వేడుకున్నా ఎవరూ స్పం దించలేదు. దీంతో వారు అరగంట పాటు బయటే నిరీక్షించారు. అలా నిరీక్షిస్తూనే ఐసోలేషన్ వార్డు ముందు వెంకటేశ్ తుది శ్వాస విడిచాడు. ప్రాణాలు పోయాక వైద్య సిబ్బందిలో కదలిక వచ్చింది. అప్పుడొచ్చి మృతదేహాన్ని మార్చురీలో పెట్టించారు. తన బిడ్డ మృతదేహాన్ని అప్పగిస్తే ఇంటికి తీసుకెళతామని ఆమె వేడుకున్నా.. కరోనా ఫలితం వచ్చాకే ఇస్తామని చెప్పారు.