ఇంటర్ ప్రవేశాలపై సందిగ్ధం
ABN , First Publish Date - 2022-06-15T22:32:47+05:30 IST
పదవ తరగతి ఫలితాలు వెలువడి వారం రోజులు దాటింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో తమకు నచ్చిన
అమరావతి: పదవ తరగతి ఫలితాలు వెలువడి వారం రోజులు దాటింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ అడ్మిషన్లపై ఇంతరవరకూ ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రవేశాలను గతేడాది మాదిరిగా ఆన్లైన్లో చేపడతారా? అంతకుముందు మాదిరిగా ఆఫ్లైన్లో చేపడతారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు కార్పొరేట్ కళాశాలు ఇంటర్మీడియట్లో ప్రవేశాలను ఇష్టారాజ్యంగా చేపడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాల్లో అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా చేపట్టాలని గత ఏడాది ఆదేశించింది.
విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో చేరడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీటు కేటాయింపు జరిగిన తర్వాత సంబంధిత కళాశాలకు వెళ్లి చేరాలి. ఇంటర్మీడియట్ బోర్డు అనుమతించిన మేరకు సెక్షన్లు, విద్యార్థులుండాలి. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని ప్రైవేటు, కార్పోరేట్ కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రకియ కొత్తగా వుండడంతో విద్యార్థులు ఆయోమయానికి గురయ్యారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో సీట్లు ఎలా ఇస్తారనేది స్పష్టత లేదు. మరోవైపు పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్లో చేరడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.