కొత్త కొత్తగా..
ABN , First Publish Date - 2022-06-23T08:49:41+05:30 IST
గతంలో వన్డేలు, టీ20లకు భిన్న కెప్టెన్లు..కానీ ఈసారి అన్ని ఫార్మాట్లకు ఒక్కరే సారథి. మరోవైపు దిగ్గజ బ్యాటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్..జట్టులో యువ క్రికెటర్లు..ఈనేపథ్యంలో
శ్రీలంకతో భారత్ మొదటి టీ20 నేడు
మిథాలీ లేకుండా తొలిసారి బరిలోకి
మధ్యాహ్నం 2 నుంచి...
దంబుల్లా: గతంలో వన్డేలు, టీ20లకు భిన్న కెప్టెన్లు..కానీ ఈసారి అన్ని ఫార్మాట్లకు ఒక్కరే సారథి. మరోవైపు దిగ్గజ బ్యాటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్..జట్టులో యువ క్రికెటర్లు.. ఈనేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ సారధ్యంలో భారత్ కొత్త సీజన్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా మూడు టీ20ల సిరీ్సలో గురువారం జరిగే మొదటి పోరులో శ్రీలంకను ఎదుర్కోనుంది. వచ్చేనెలలో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టీ20 ఫార్మాట్ అరంగేట్రం చేయనుంది. దాంతోపాటు మరో ఎనిమిది నెలల్లో పొట్టి ప్రపంచ కప్ జరగనుండడంతో టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. అంతేకాదు..గత వన్డే వరల్డ్ కప్లో విఫలమైన టీమిండియా ఆ తర్వాత పాల్గొంటున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కూడా ఇదే. సారథి హర్మన్కు వ్యక్తిగతంగా ఈ సిరీస్ ప్రాధాన్యమైనది.
33 ఏళ్ల ఈ బ్యాటర్ 121 టీ20లలో 2319 పరుగులు చేసింది. పొట్టి సిరీ్సలో అత్యధిక రన్స్ చేసిన లెజెండరీ మిథాలీ రాజ్ రికార్డును అధిగమించేందుకు కౌర్ మరో 46 రన్స్ దూరంలో ఉంది. మంధాన, షఫాలీ వర్మ, దీప్తీశర్మ, పేసర్ పూజా వస్ర్తాకర్ అద్భుత ఫామ్లో ఉండడం టీమిండియాకు సానుకూలం. మరోవైపు పాకిస్థాన్తో ఇటీవల జరిగిన టీ20లలో 0-3తో చిత్తయిన శ్రీలంక..భారత్తో సిరీస్ ద్వారా ఆ పరాజయ భారం నుంచి బయటపడాలని భావిస్తోంది. వెటరన్లు ఒషాడి రణసింఘే, చమరి ఆటపట్టు ఆతిథ్య జట్టుకు కీలకం కానున్నారు. ప్రస్తుత ఫామ్, ప్రపంచ ర్యాంక్ ద్వారా చూస్తే సిరీ్సలో భారతే ఫేవరెట్గా చెప్పాలి. దాంతో పర్యాటక జట్టును నిలువరించాలంటే శ్రీలంక సర్వశక్తులూ కూడదీసుకోక తప్పదు. సిరీ్సలో ఫీల్డింగ్పై ప్రధానంగా దృష్టి నిలిపినట్టు కెప్టెన్ హర్మన్ చెప్పింది. ‘టాప్ బ్యాటర్లు, బౌలర్లు ఫిట్గా ఉన్నారు. అందువల్ల సిరీ్సలో ఉత్తమంగా రాణిస్తాం’ అని తెలిపింది.
జట్లు (అంచనా)
భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), మంధాన (వైస్ కెప్టెన్), సిమ్రాన్ బహదూర్, యాస్తిక, రాజేశ్వరి, రిచా ఘోష్ (కీపర్), మేఘన సబ్బినేని, మేఘనా సింగ్, పూనమ్, రేణుకా సింగ్, జెమీమా, షఫాలి, దీప్తి, పూజ, రాధా యాదవ్.
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్), నీలాక్షీ డిసిల్వా, కవిషా దిల్హరీ, విష్మీ గుణరత్నే, అమా కాంచన, హన్సిమా కరుణరత్నే, అచినీ కులసూర్య, సుగందికా కుమారి, హర్షితా మాధవి, హాసినీ పెరెరా, ప్రబోధిని, ఒషాడి రణసింఘే, ఇనోకా రాణవీర, సందీపని, అనుష్క సంజీవని, మల్షా, థారికా సెవంది.