సింగపూర్లో భారతీయ మహిళ నిర్వాకం.. టూర్ల పేరుతో ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2021-08-11T22:01:29+05:30 IST
టూర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన భారతీయ మహిళకు సింగపూర్ న్యాయస్థానం 20 వారాల జైలు శిక్ష విధించింది.
సింగపూర్ సిటీ: టూర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన భారతీయ మహిళకు సింగపూర్ న్యాయస్థానం 20 వారాల జైలు శిక్ష విధించింది. భారత్, దుబాయ్కు వివిధ టూర్ ప్యాకేజీల పేరిట పలువురిని ఆమె 35వేల సింగపూర్ డాలర్లు(రూ.19.15లక్షలు) మోసగించినట్లు కోర్టు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్కు చెందిన లీలావతి(55) అనే మహిళ ఇలా నకిలీ టూర్ల పేరిట వినియోగదారులను మోసగించింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా గత దశాబ్దకాలంగా ఫ్రీలాన్స్ ట్రావెల్ ఏజెంట్గా పని చేస్తున్న లీలావతి.. భారత్, దుబాయ్ నగరానికి టూర్ ప్యాకేజీలంటూ 8 మందిని 19 ఫేక్ ట్రిప్స్ పేరిట మోసగించింది. మొదట రిజిస్ట్రేషన్ పేరుతో బాధితుల వద్ద 500 సింగపూర్ డాలర్లు కట్టించుకునేది. ఆ తర్వాత వారికి టూర్కు సంబంధించి ఓ తేదీ ఇచ్చేది. ఆ తేదీకి రెండు మూడు రోజుల ముందు ట్రిప్కు సంబంధించిన మొత్తం డబ్బులు ఒకేసారి తన తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చెప్పేది.
అలా కస్టమర్లు నగదు జమ చేయడమే ఆలస్యం ఆ తర్వాత తన మొబైల్ స్వీచ్ఛాప్ చేసేయడమో లేదా కాల్ లిఫ్ట్ చేయకపోవడమో చేసేది. అటు ఆమె ఆఫీస్కు కూడా తాళం వేసేది. అనంతరం రెండు రోజుల తర్వాత మళ్లీ వారికి ఫోన్ చేసి తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని డ్రామాలు ఆడేది. తన తల్లి ఐసీయూలో ఉందని, ప్రస్తుతానికి టూర్ క్యాన్సిల్ చేశామని, త్వరలోనే మరో కొత్త తేదీ ఇస్తానని చెప్పేది. ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు అంటూ వినియోగదారులను తిప్పుకునేది. ఇలా ఆమె 2013 నుంచి 2017 వరకు ఎనిమిది మంది బాధితుల నుంచి 34,950 సింగపూర్ డాలర్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా పలువురిని ఆమె ఇలాగే నకిలీ టూర్ల పేరుతో మోసగించడం చేసింది. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా లీలావతిని దోషిగా తేల్చిన సింగపూర్ న్యాయస్థానం ఆమెకు 20 వారాల శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.