Olympics: పతకం దిశగా భారత గోల్ఫర్.. చరిత్రకు అడుగు దూరంలో..

ABN , First Publish Date - 2021-08-06T19:11:07+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది.

Olympics: పతకం దిశగా భారత గోల్ఫర్.. చరిత్రకు అడుగు దూరంలో..

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఫైనల్‌కు చేరింది. మూడు రౌండ్లు ముగిసేసరి అదితి రెండో స్థానంలో నిలిచింది. అసలు ఈ విభాగంలో భారత్ రాణించడం కూడా ఇదే తొలిసారి. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 3లో రెండో స్థానంలో నిలిచిన అదితికి ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశముంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసేసరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.


అమెరికాకు చెందిన నెల్లి కొర్డా 198 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే.. హన్నా గ్రీన్​(ఆస్ట్రేలియా), లైడియా(న్యూజిలాండ్​) 203 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ గోల్ఫ్ ఈవెంట్‌లో ఎవరైతే తక్కువ పాయింట్లు సాధిస్తారో వారే మొదటి స్థానంలో ఉంటారు. కాగా, శుక్రవారం జరగాల్సిన రౌండ్​ 4 వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది.


ఒకవేళ శనివారం కూడా పోటీలు​ జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి​ రజతం ఖాయం అవుతుంది. ఒకవేళ పోటీలు జరిగిన అదితికి కాంస్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే ఒలింపిక్స్​లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్​గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తుంది. కనుక అదితి చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉంది.  

Updated Date - 2021-08-06T19:11:07+05:30 IST