Mahzooz Raffle: జాక్‌పాట్ కొట్టిన భారత వ్యక్తి.. ఎంత గెలుచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-06-11T14:18:58+05:30 IST

Mahzooz Raffle లో భారత ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది.

Mahzooz Raffle: జాక్‌పాట్ కొట్టిన భారత వ్యక్తి.. ఎంత గెలుచుకున్నాడంటే..

దుబాయ్: Mahzooz Raffle లో భారత ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది. తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ రాఫెల్ డ్రాలో దుబాయ్‌లో ఉండే భారత్‌కు చెందిన మహమ్మద్ ఏకంగా 1లక్ష దిర్హమ్స్(రూ.21.28లక్షలు) గెలుచుకున్నాడు. ఆరేళ్లుగా యూఏఈలో ఉంటున్న కేరళ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహమ్మద్ దుబాయ్‌లో మరోవ్యక్తితో కలిసి చిన్న పెర్ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆన్‌లైన్ ద్వారా 35 దిర్హమ్స్ పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనడం ద్వారా మహజూజ్ రాఫెల్‌లో ఎంటర్ అయినట్లు తెలిపాడు. అలా 35 దిర్హమ్స్‌తో కొన్న వాటర్ బాటిల్‌తో డ్రాలో పాల్గొనేందుకు ఓ లైఫ్‌లైన్ లభిస్తుందట. ఇక తాజాగా నిర్వహించిన వీక్లీ డ్రాలో మహమ్మద్‌కు అదృష్టం వరించింది. అంతే.. విజేతగా నిలిచి రూ.21.28లక్షలు సొంతం చేసుకున్నాడు. 


లైవ్ డ్రా సమయంలో పనిమీద బయటకెళ్లిన అతడు.. ఇంటికి వచ్చి మెయిల్ చెక్ చేసుకోగా లాటరీ నిర్వాహకుల నుంచి తాను 1లక్ష దిర్హమ్స్ గెలిచినట్లు సందేశం ఉంది. దాంతో వెంటనే తన మహజూజ్ ఖాతాను ఓపెన్ చేసి చూస్తే నిజంగానే డ్రాలో విజేతగా నిలిచినట్లు నిర్ధారించుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని స్వదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వినియోగించనున్నట్లు చెప్పాడు. అంతేకాదండోయ్.. మనోడు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఇప్పుడు లాటరీ రూపంలో తన చేతికి భారీ మొత్తం రావడంతో పెళ్లి చాలా ఘనంగా చేసుకుంటానని మురిసిపోతున్నాడు. అలాగే తన తల్లికి చాలా కాలంగా ఓ ఖరీదైన గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉందని చెప్పిన మహమ్మద్.. ఇవాళ అది నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశాడు.     

Updated Date - 2022-06-11T14:18:58+05:30 IST