India vs Australia: రూ.850 టికెట్.. రూ.11 వేలు
ABN , First Publish Date - 2022-09-25T23:47:35+05:30 IST
ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్ సిరీస్ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఆదివారం జరిగే 3వ టీ20 మ్యాచ్ సిరీస్ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానులు వివిధ మార్గాల్లో టికెట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్ను మైదానంలో తిలకించడానికి ఉవ్విళ్లూరుతున్న అభిమానుల బలహీనతను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర టికెట్లను బ్లాక్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్టీవో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6 టికెట్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. రూ.850 టికెట్ను రూ.11 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నేడు భారత్ - ఆస్ట్రేలియా (India-Australia) మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. అలాగే జింకానా గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.1500 టిక్కెట్లను రూ. 6వేలకు అమ్ముతుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరు టికెట్లను స్వాధీనం చేసుకుని బ్లాక్లో టిక్కెట్లు అమ్మినవారిని బేగంపేట్ పోలీసులకు అప్పగించారు. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
టీ-20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశారు. బోడుప్పల్కు చెందిన మచ్చేంద్ర, ఉప్పల్కు చెందిన భరత్రెడ్డి చైతన్యపురి పోలీ్సస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి రూ.1500 మ్యాచ్ టికెట్లను రూ.6వేలకు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. రెండు టికెట్లతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో నాగోల్ వంతెన వద్ద శనివారం రాత్రి వెయ్యి రూపాయల టికెట్ను బ్లాకులో రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందింది. వంతెన వద్ద నిఘా పెట్టి నిందితులైన ఉప్పల్, రామంతాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వడ్డేపల్లి రాహుల్(25)ను, ఎస్.గోపీ(26)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 వెయ్యి రూపాయల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.