ఇంధన రంగంలో భారత్‌ సూపర్‌ పవర్‌ కావాలి

ABN , First Publish Date - 2020-11-22T06:31:15+05:30 IST

ఇంధన రంగంలో మన దేశాన్ని ‘సూపర్‌ పవర్‌’ గా నిలబెట్టాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. ఇందుకోసం వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని కోరారు...

ఇంధన రంగంలో భారత్‌ సూపర్‌ పవర్‌ కావాలి

అహ్మదాబాద్‌: ఇంధన రంగంలో మన దేశాన్ని ‘సూపర్‌ పవర్‌’ గా నిలబెట్టాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు.  ఇందుకోసం వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని కోరారు. గాంధీనగర్‌లోని పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ యూనివర్సిటీ (పీడీపీయూ) స్నాతకోత్సవంలో ఆయన ఈ మేరకు పిలుపు ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన నిల్వ, తక్కువ కాలుష్య ఇంధనాల కోసం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  భారత్‌ను ఆర్థిక, ఇంధన రంగాల్లో అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 

కొవిడ్‌ తర్వాత దౌడే: కొవిడ్‌ సద్దుమణిగాక ఆర్థికంగా భారత్‌కు పట్టపగ్గాలు ఉండవని ముకేశ్‌ అంబానీ అన్నారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు స్థాపించే స్టార్టప్‌ కంపెనీలే వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారతాయన్నారు.  వచ్చే 20 సంవత్సరాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించి ముందుకు వెళ్లే సత్తా భారతీయుల రక్తంలోనే ఉందన్నారు. 

Updated Date - 2020-11-22T06:31:15+05:30 IST