Kabul Gurdwara Attack: అక్కడి సిక్కులకు 100 e-visa లు జారీ చేసిన భారత్
ABN , First Publish Date - 2022-06-19T19:09:38+05:30 IST
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాబుల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి నేపథ్యంలో అక్కడి సిక్కులు, హిందువులను భారత్కు తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. దీనిలో భాగంగా 100 ఈ-వీసాలను(e-visas) జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల పట్ల ఆఫ్గాన్లోని ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటున్న భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ దాడి తమ పనేనని ఐసీస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. అక్కడి హిందూ, సిక్కు వర్గాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. 2020 మార్చిలో కూడా ఇలాగే కాబుల్లోని హర్ రాయ్ సాహిబ్(Har Rai Sahib) అనే గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడిలో 25 మంది చనిపోగా, 8 మంది గాయపడ్డారు. ఇదిలాఉంటే.. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్పై ప్రవక్తపై చేసిన వావాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అటు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర ఇస్లామిక్ దేశాలన్నీ కూడా నుపుర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కువైత్ అయితే ఓ అడుగు ముందుకేసి మన వస్తువులను సైతం బహిష్కరించింది. తాజాగా కాబుల్ గురుద్వారా దాడికి కూడా ఆమె వ్యాఖ్యలే కారణమని ఉగ్రవాదులు పేర్కొన్నారు.