'ఎయిర్ బబుల్' జాబితాలో మరో రెండు దేశాలు
ABN , First Publish Date - 2020-10-02T01:11:16+05:30 IST
అక్టోబర్ చివరి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: అక్టోబర్ చివరి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, 'వందే భారత్ మిషన్' కింద విదేశీ విమాన సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. అలాగే భారత్ కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య విమాన సర్వీసుల రాకపోకలకు(రెండు వైపుల నుంచి) వీలు ఏర్పడుతుంది. ఇప్పటికే పలు దేశాలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా మరో రెండు దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కెన్యా, భూటాన్తో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, ఖతార్, అఫ్గానిస్థాన్, మాల్దీవులు, యూఏఈలతో ఇండియా ఈ ఒప్పందం చేసుకుంది.
మరోవైపు ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎయిర్ ఇండియా అమెరికాలోని వివిధ నగరాలకు డైరెక్ట్గా మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ టు నెవార్క్ నాన్స్టాప్ విమాన సర్వీసు నడపనున్నట్లు ప్రకటించింది. వారానికి మూడుసార్లు ఈ సర్వీసు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే నార్త్ అమెరికన్ నగరాలైన న్యూయార్క్ జేఎఫ్కే, వాషింగ్టన్, చికాగో, టొరంటో, వాంకోవర్, శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియా నాన్స్టాప్ విమానాలు నడిపిస్తోంది. నెవార్క్కు మాత్రం ఇదే తొలిసారి. అలాగే ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా భారత్లోని కోల్కతా, కొచ్చిన్, గోవా నుంచి లండన్కు కూడా డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపిస్తున్నట్లు ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ఇక కోల్కతా నుంచి లండన్కు నడుస్తున్న నాన్స్టాప్ విమాన సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు తెలియజేశారు. ఇంతకుముందు ఈ సర్వీస్ అక్టోబర్ 24 వరకు మాత్రమే ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది.