పోరాడిన అమ్మాయిలు

ABN , First Publish Date - 2022-07-04T09:59:57+05:30 IST

ఇంగ్లండ్‌తో వరల్డ్‌ కప్‌ హాకీ తొలి మ్యాచ్‌ను భారత్‌ డ్రాగా ముగించింది.

పోరాడిన అమ్మాయిలు

ఇంగ్లండ్‌తో భారత్‌ మ్యాచ్‌ డ్రా

మహిళల ప్రపంచ కప్‌ హాకీ

ఆమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): ఇంగ్లండ్‌తో వరల్డ్‌ కప్‌ హాకీ తొలి మ్యాచ్‌ను భారత్‌ డ్రాగా ముగించింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఈ పోరులో 1-1తో ప్రత్యర్థిని నిలువరించింది. తొమ్మిదో నిమిషంలోనే ఇసబెల్లా పెటెర్‌ చేసిన ఫీల్డ్‌ గోల్‌తో ఇంగ్లండ్‌ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ 28వ నిమిషంలో వందనా కటారియా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ స్కోరును సమం చేసింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి రెండు క్వార్టర్ల ఆట మజాగా సాగింది. ఆ తర్వాతా ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో మరో గోల్‌ నమోదవలేదు. దాంతో నిర్ణీత సమయం ముగిసేసరికి మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడనుంది. 

Updated Date - 2022-07-04T09:59:57+05:30 IST