లాజిస్టిక్స్ హబ్గా భారత్
ABN , First Publish Date - 2022-08-19T08:39:02+05:30 IST
భారతదేశం సరకు రవాణా (లాజిస్టిక్స్ హబ్) కేంద్రంగా అభివృద్ధి చెందనుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వరంగ పోర్టుల్లో పీపీపీపై ముగింపు సదస్సులో వక్తలు
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భారతదేశం సరకు రవాణా (లాజిస్టిక్స్ హబ్) కేంద్రంగా అభివృద్ధి చెందనుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వరంగ పోర్టుల్లో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) అనే అంశంపై విశాఖపట్నం పోర్టు నిర్వహించిన ముగింపు సదస్సుకు గురువారం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ అధికార ప్రతినిధి డేవిడ్ రాజా.. రోడ్డు సరకు రవాణాను, సముద్ర రవాణాగా మార్చడంలో అనుసరించాల్సిన విధానాలు, ఎంఎస్ఎంఈలకు అన్లైన్ విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రసంగించారు. విశాఖపట్నం కేంద్రంగా కంటెయినర్ రవాణాలో వస్తున్న మార్పులు, అభివృద్ధి అంశాలపై కంటెయినర్ లైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ మాట్లాడారు. సాంకేతిక అంశాలపై నాస్కామ్ సీఈఓ మల్హోత్రా ప్రసంగించారు. వాల్తేరు రైల్వే డీఆర్ఎం అనూప్కుమార్ శెత్పథి మాట్లాడుతూ.. రైల్వే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు తయారుచేస్తున్న ప్రణాళికలు వివరించారు. గతిశక్తి ప్రాజెక్టుల వల్ల రైల్వేకు నిర్వహణ, కనెక్టివిటీ ఖర్చులు తగ్గాయన్నారు. ఈ సమావేశంలో విశాఖ జేసీబీ సీఈఓ సతీశ్, షిప్యార్డ్ సీఎండీ హేమంత్ ఖత్రీ, కాంకర్ ఈడీ అజార్ శ్యామ్ తదితరులు హాజరయ్యారు. విశాఖ పోర్టు చైర్మన్ రామమోహన్రావు ముగింపు ఉపన్యాసం ఇస్తూ రెండు రోజుల సదస్సును విజయవంతం చేసి, వ్యాపార అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చిందనుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.