తాత చనిపోతే ఫ్రిజ్లో కుక్కాడు.. ఏమైందని ఆరా తీయగా..!
ABN , First Publish Date - 2021-08-13T08:39:05+05:30 IST
ఆ ఇంట్లో ఉండేది తాత, మనుమడు ఇద్దరే. తొంభయ్యేళ్ల వయసులో కదల్లేని స్థితిలో ఉన్న తాత కోసం ఆ మనుమడు రోజూ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెచ్చి తినిపించేవాడు. ఒకానొకరోజు ఆ వృద్ధుడు చనిపోయాడు.
మనుమడి నిర్వాకం.. 3, 4 రోజులు ఇంట్లో శవం
బయటపడితే ఒకట్రెండు రోజుల్లో పడాల్సిన జూలై పింఛన్ రాదనే ..
ఖాతాలో పడ్డ రూ.40వేలు అయినా మరణాన్ని దాచి జల్సా
ఇంట్లోంచి దుర్వాసన..
యజమాని ప్రశ్నించడంతో బయటపడ్డ వైనం
పరకాలలో ఘటన
పరకాల, ఆగస్టు 12: ఆ ఇంట్లో ఉండేది తాత, మనుమడు ఇద్దరే. తొంభయ్యేళ్ల వయసులో కదల్లేని స్థితిలో ఉన్న తాత కోసం ఆ మనుమడు రోజూ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెచ్చి తినిపించేవాడు. ఒకానొకరోజు ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని మనుమడు బయట ఎవ్వరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఫ్రిజ్లో కుక్కాడు. శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులున్నాడు, తాతంటే ప్రేమతోనో.. ఆయన్ను విడిచి ఉండలేకో అతడీ పని చేయలేదు. మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయనకు వస్తున్న పెన్షన్ డబ్బుల కోసమే! తాత చనిపోయాడని బయట ప్రపంచానికి తెలిస్తే ఒకట్రెండు రోజుల్లో ఆయన ఖాతాలో పడాల్సిన డబ్బులు కాస్తా పడవు అని భావించి ఈ పనిచేశాడు. మానవతావాదులను కదిలించివేసిన ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వెలుగుచూసింది!
మనుమడి జల్సాలు..
కామారెడ్డి జిల్లా కామారానికి చెందిన బైరం బాలయ్య (90) రిటైర్డ్ టీచర్. పదేళ్ల క్రితం కుటుంబంతో పరకాలకు వచ్చారు. ఏడేళ్లుగా పొరండ్ల కైలాసం కాంప్లెక్స్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈయనకు హరికిషన్ ఏకైక కుమారుడు. హరికిషన్ భార్య గతంలోనే చనిపోయింది. హరికిషన్కు కుమారుడు నిఖిల్ (22) ఉన్నాడు. పౌరోహిత్యం చేసుకునే హరికిషన్ 2019లో ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాలయ్య భార్య నర్సమ్మ రెండు నెలల క్రితం కరోనాతో చనిపోయింది. దీంతో ఇంట్లో బాలయ్య, నిఖిల్ మాత్రమే ఉంటున్నారు. పదో తరగతితో చదువు మానేసిన నిఖిల్, పనీపాటా లేకుండా బలాదూర్గా తిరుగుతున్నాడు. బాలయ్యకు నెలకు వచ్చే రూ.40 వెల పెన్షన్ డబ్బులే ఇద్దరికీ ఆధారం. ఆ డబ్బుతో నిఖిల్ బయట జల్సాలు చేసేవాడు. మూడు రోజులుగా బాలయ్య అద్దెకు ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్లు ఇంటి ఓనర్కు చుట్టుపక్కల వారు సమాచారమిచ్చారు. గురువారం ఇంటి యజమాని కైలాసం, పోర్షన్లోకి ప్రవేశించి వెతికారు. చివరికి నిఖిల్ను గట్టిగా నిలదీసేసరికి తాత చనిపోయాడని.. అంత్యక్రియలకు డబ్బుల్లేక ఫ్రిజ్లో పెట్టినట్లు ఏడుస్తూ చెప్పాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారొచ్చి ఫ్రిజ్ ఓపెన్ చేసి చూసేసరికి బాలయ్య మృతదేహం కనిపించింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో బాలయ్య చనిపోయి మూడు, నాలుగు రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని కైలాసం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పింఛను డబ్బులు పడటంతో..
బాలయ్య చనిపోవడంతో తాతకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పడాల్సిన జూలై నెల పింఛను డబ్బులు రావని నిఖిల్ ఆందోళన చెందాడు. పింఛను డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యే దాకా తాత చనిపోయిన విషయం తెలియనివ్వకుండా చేసేందుకే మృతదేహాన్ని ఫ్రిజ్లో పెట్టి ఏమీ ఎరుగనట్లు ఉంటున్నాడు. ఈ లోగా పింఛను డబ్బులు రూ.40వేలు పడ్డాయి. అయినా తాత మృతిచెందాడనే విషయాన్ని బయట పెట్టకుండా ఖాతాలోని డబ్బును డ్రా చేసుకొని జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. డబ్బుల కోసమే తాతను చంపివుంటాడా? అని అనుమానించినా.. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో సహజ మరణమేనని ధ్రువపడింది.