కాజీపేటలో రైల్వే డీఆర్ఎం పర్యటన
ABN , First Publish Date - 2022-01-22T04:37:21+05:30 IST
కాజీపేటలో రైల్వే డీఆర్ఎం పర్యటన
సమస్యలపై చర్చించిన చీఫ్ విప్ వినయ్భాస్కర్
కాజీపేట, జనవరి 21 : కాజీపేటలో శుక్రవారం రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా పర్యటించారు. ఉదయం ఎలక్ర్టికల్ లోకోషెడ్లో పర్యటించారు. షెడ్లో ఎలక్ర్టిక్ ఇంజన్ల పనితీరు, సిబ్బంది తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈఎల్ఎ్సలో రైల్వే అధికారులతో గంటపాటు డిపార్ట్మెంట్ అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం రైల్వే గెస్ట్హౌ్సలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మలు డీఆర్ఎంను విడివిడిగా కలిసి రైల్వే సమస్యలపై చర్చించారు.
కాజీపేటను డివిజన్గా ఉన్నతీకరించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చీఫ్ విప్ కోరారు. రైల్వే స్టేడియం అభివృద్ధి చేయాలని, నూతనంగా ఫాతిమానగర్ వద్ద నిర్మిస్తున్న ఆర్వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలని, క్రూ డిపోను కాజీపేటకు తరలించాలని, వ్యాగన్ పరిశ్రమ నిర్మాణం వెంటనే చేపట్టాలని, టౌన్స్టేషన్ను అభివృద్ధి చేయాలని కోరారు. క్రూలింక్లను కాజీపేటకు తరలించడం సాధ్యం కాకపోవచ్చని డీఆర్ఎం అభిప్రాయం వెలిబుచ్చడంతో రావు పద్మ ఆయనతో వాగ్వాదానికి దిగారు. క్రూలింక్లను కాజీపేటకు తరలించాల్సిందేనని కోరారు.
ఇదిలా ఉండగా ఈఎల్ఎస్ బ్రాంచ్ కో- ఆర్డినేటర్ నాయిని సదానందం, సెక్రటరీ ఎస్. రవీందర్ ఆధ్వర్యంలో పాయింట్స్ మెన్ వెకెన్సీలను భర్తీ చేయాలని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు చేయాలని, రైల్వే కాలనీలలో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుబ్రహ్మణ్యం, ఆర్డీవో వాసు చంద్ర, స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు, రైల్వే కార్మిక నాయకులు ఉన్నారు.