ముంచేసిన ‘లవ్ లైఫ్’!
ABN , First Publish Date - 2021-12-26T08:17:42+05:30 IST
ముంచేసిన ‘లవ్ లైఫ్’!
దేశంలోనే భారీ డిజిటల్ స్కాం
వేల కోట్లు టోకరా.. మన రాష్ట్రంలో 200 కోట్ల మేర మోసం
వేలల్లో బాధితులు.. సైబర్ పీఎస్ల్లో ఫిర్యాదు
విజయవాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రేమ, జీవితం... ఈ రెండు పదాలు ఓ భారీ మోసానికి పునాదిగా మారాయి. వైద్యరంగంలో ఉన్న అవసరాలకు ఈ రెండింటినీ మిళితం చేసిన లవ్లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ అనే డిజిటల్ ఫ్లాట్ఫాం అమాయకులను నిలువునా మోసం చేసింది. కరోనా నేపథ్యంలో వివిధ రకాల వైద్య పరికరాలను ఆన్లైన్లో ఉంచి వాటిని రీచార్జి చేసుకోవడం ద్వారా భారీగా ఆదాయం పొందవచ్చని ఆ సంస్థ చేసిన ప్రకటన వేలాది మందిని నట్టేట ముంచింది. రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర బాధితులు నష్టపోయారు. కరోనాకు ముందు ఏర్పడిన ఈ సంస్థ లింక్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించింది. రూ.500 నుంచి రూ.2లక్షల 97వేల వరకు వరకు వైద్య పరికరాలను ఈ లింక్లో అందుబాటులో ఉంచింది. ఒక్కో పరికరానికి ఒక్కో ధర నిర్ణయించింది. రూ.500 పరికరాన్ని రీచార్జి చేసుకున్న వారికి రోజుకు రూ.25చొప్పున, రూ.800 పరికరాన్ని రీచార్జి చేసుకున్న వారికి రోజుకు రూ.42 చొప్పున 60 రోజుల పాటు చెల్లిస్తామని ప్రకటనలు చేసింది. ఈ ఆదాయాన్ని రుచి చూసిన కొంతమంది ఆ లింక్ల ద్వారా మరికొంతమందిని సభ్యులుగా చేర్చారు. ఇలా చేసినందుకు రూ.110 నుంచి రూ.2వేల వరకు గిఫ్ట్ రివార్డులను ప్రకటించింది. తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం రావడంతో వినియోగదారులు పెట్టుబడిని పెంచుకుంటూ పోయారు. ఏడాది నుంచి ఈ డిజిటల్ ఫ్లాట్ఫాంలో ఉన్నవారు లక్షల్లోనే ఆదాయాన్ని ఆర్జించారు. మొదట్లో విత్డ్రా డబ్బులు ఒకరోజులోనే ఖాతాల్లో జమయ్యాయి. తర్వాత సభ్యులు పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని విత్డ్రాల గడువును రెండు రోజులకు పెంచారు. ఈ నెల 18 తర్వాత లవ్లైఫ్ వ్యాలెట్లో ఉన్న నగదును విత్డ్రా చేసుకున్న వారికి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీనిపై ఆయా వాట్సాప్ గ్రూపుల్లో అనేకమంది సందేహాలను వ్యక్తం చేశారు. లవ్లైఫ్ పేరుతో దాదాపు 370 వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తోన్న అనసూయ అనే మహిళ 24వ తేదీ రాత్రి ఖాతాల్లో జమవుతాయని మెసేజ్ చేసింది. అప్పటికీ డబ్బులు రాకపోవడంతో మళ్లీ గ్రూపుల్లో మెసేజ్లు చేశారు. దీంతొ 25వ తేదీ నగదు జమ కావడం ఖాయమని స్పష్టం చేసింది. అన్ని గ్రూపుల్లోనూ శుక్రవారం రాత్రి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని మెసేజ్ చేసింది. శనివారం ఉదయం నుంచి లవ్లైఫ్ వెబ్సైట్, యాప్ పనిచేయడం మానేయడంతో బాధితులు గగ్గోలు పెట్టాన్నారు. దేశంలోనే ఇదో భారీ డిజిటల్ స్కాం అని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థ వేలాది కోట్ల రూపాయలకు టోకరా వేసిందని ఉత్తరాది మీడియా పేర్కొంది. దీనిపై బాధితులు సైబర్ క్రైం పోలీసులకు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడలోనూ ఈ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయి.