సర్కారు బడిలో విద్యార్థికి అస్వస్థత
ABN , First Publish Date - 2022-06-25T09:23:30+05:30 IST
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురై చనిపోయాడు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
పోస్టుమార్టం తర్వాత కారణాలు తెలుస్తాయి: పోలీసులు
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రుల ఆరోపణ
నర్సింహులపేట (మహబూబాబాద్), జూన్ 24 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురై చనిపోయాడు. విద్యార్థి అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై 108 వాహనంలో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం ముంగిమడుగు పకీరా తండాకు చెందిన భూక్య అఖిల్ (14) మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదువుతున్నాడు. మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తరగతి గదిలో కూర్చున్న అఖిల్ ఒక్కసారిగా కుప్పకూలాడు. తక్షణమే అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానిక ఆర్ఎంపీతో ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఖిల్ను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయాడని ధ్రువీకరించారు.
సకాలంలో వైద్య పరీక్షలు అందించకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తలిదండ్రులు రోదిస్తూ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుమారుడి మృతిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. కాగా పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అయితే అఖిల్ మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెన్నం వెంకట్రెడ్డి అన్నారు.