చర్మం కాంతులీనాలంటే...
ABN , First Publish Date - 2021-01-20T05:46:22+05:30 IST
చర్మం కాంతులీనాలంటే ఇదిగో ఇలా చేయండి...
చర్మం కాంతులీనాలంటే ఇదిగో ఇలా చేయండి...
బకెట్ గోరువెచ్చటి నీళ్లల్లో రెండు కప్పులు పాలు పోసి ఆ నీటితో స్నానం చేస్తే పొడిబారిన చర్మం తాజాదనంతో మెరుస్తుంది.
కమిలిన చర్మం కాంతివంతంగా కనిపించాలంటే అరటిపండును మెత్తగా చేసి అందులో టేబుల్స్పూన్ పాలుపోసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్కుగా పట్టించాలి. ఆ మాస్కు పూర్తిగా పొడారిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మిలమిలా మెరుస్తుంది.
అర కప్పు ఓట్స్లో కొద్దిగా పుల్లటి పెరుగు వేసి పేస్టులా చేసి స్నానం చేసే ముందు రాసుకుంటే చర్మంలోని మృతకణాలు పోతాయి.
క్యారెట్ను పేస్టుగా చేసి ముఖానికి రాసుకుని కాసేపు ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే చర్మం నిగ నిగలాడుతుంది.
కొంచెం దూది తీసుకుని మరిగిన పాలల్లో ముంచి దానితో ముఖాన్ని తుడుచుకుంటే చర్మానికి అతుక్కుపోయిన దుమ్ము, ధూళి, కాలుష్యం ఇట్టే పోతుంది. ముఖం తాజాదనంతో వెలిగిపోతుంది.
గుప్పెడు పుదీనా, వేపాకులు, నాలుగు లవంగాలను కలిపి మెత్తగా ముద్దలా చేసి అందులో రెండు చెంచాల గులాబీ నీరు కలపాలి. మరుసటి రోజు ఈ మిశ్ర మంతో ఒంటిని రుద్దుకుని స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలు పోతాయి.
రెండు చెంచాల నారింజ రసంలో ఒక్కొక్క చెంచా చొప్పున పాలు, తేనెలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఈ మిశ్రమంలోని పాలు క్లెన్సర్గా పనిచేసి చర్మంలోని మురికి, జిడ్డును పోగొట్టి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. తేనె చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది.
గంధం పొడిలో కాసిని నీళ్లు కలిపి దాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని కలుగచేసి సాంత్వననిస్తుంది.