ప్రజలు బాధ్యతగా ఉంటేనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2021-07-15T06:12:37+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు ‘కరోనా మూడో వేవ్, దానికదే రాదు. మనం పిలిస్తేనే వస్తుంద’న్నది అక్షరాలా నిజం. మార్కెట్‌లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో...

ప్రజలు బాధ్యతగా ఉంటేనే  కరోనా కట్టడి

ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు ‘కరోనా మూడో వేవ్, దానికదే రాదు. మనం పిలిస్తేనే వస్తుంద’న్నది అక్షరాలా నిజం. మార్కెట్‌లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికీ మాస్కు ధరించడాన్ని ప్రజలు తప్పనిసరిగా భావించడం లేదు. ఒకవైపు థర్డ్ వేవ్ రావడంపై చర్చోపచర్చలు జరుగుతున్నా వారు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కన్నా మళ్ళీ వేవ్ వచ్చే లోపల ఎంజాయ్ చేద్దామన్న భావన, నిర్లక్ష్యధోరణి ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వైఖరి సామాజిక నేరం. జనం గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి సందర్భాన్ని కేంద్రప్రభుత్వం కొన్నాళ్ళు  నిషేధించాలి. సాధారణ లాక్‌డౌన్‌ల స్థానే క్షేత్రస్థాయిలో మైక్రో కంటైన్‌మెంట్ జోన్ వ్యూహాన్ని అమలుపర్చాలి. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చెయ్యాలి. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజెన్, మందులు, సుశిక్షితులైన వైద్య ఆరోగ్య సిబ్బందిని సిద్ధం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వాడని వారిని, అనవసరంగా గుమిగూడే వారిని, నిబంధనలు అతిక్రమించే వారిని వెనువెంటనే జరిమానాలతో శిక్షించాలి. అదే విధంగా కేంద్రం తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా పాటించాలి. రాష్ట్రాలకు తగు సాయం చెయ్యడంతో బాటు, స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వాలి. కోట్లాదిమంది ఒకే చోటికి చేరే కన్వర్‌ యాత్ర త్వరలో మొదలు కాబోతోంది. ఇలాంటి యాత్రను, ఉత్సవాలను తప్పనిసరిగా నిలిపివేయాల్సిందే. ప్రజలు, ప్రభుత్వం, మీడియా సమిష్టిగా, స్వచ్చందంగా బాధ్యతతో వ్యవహరించకపోతే నష్టాన్ని అందరూ ఉమ్మడిగానే అనుభవించాల్సి వస్తుంది. 

డా. డి.వి.జి. శంకరరావు 

Updated Date - 2021-07-15T06:12:37+05:30 IST