‘ఏ ప్లస్‌’ కేటగిరీలోకి ఐడీసీ

ABN , First Publish Date - 2022-01-25T07:49:48+05:30 IST

తెలంగాణ రాష్ట్ర నీటివనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి

‘ఏ ప్లస్‌’ కేటగిరీలోకి ఐడీసీ

  • అతి తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం
  • అధికారులకు సమాచారం పంపిన ఈఆర్‌సీ


హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నీటివనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సడబ్ల్యూఆర్‌ ఐడీసీ)కు ఉత్తమ ర్యాంకు దక్కింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ‘ఏ ప్లస్‌’ కేటగిరీలో ఐడీసీని చేర్చింది. ఈ మేరకు ఆర్‌ఈసీ అధికారులు రాష్ట్రానికి సమాచారం అందించారు. ఇప్పటికే కాళేశ్వరం కార్పొరేషన్‌ను ‘ఏ’ కేటగిరీ వరించగా.... దానికన్నా మెరుగైన ‘ఏ ప్లస్‌’ కేటగిరీలో ఐడీసీ చేరడం గమనార్హం.


సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌), ఇందిరమ్మ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌, సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులు ఈ కార్పొరేషన్‌ తీసుకునే రుణాల ఆధారంగానే జరుగుతున్నాయి. 11.18లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు 10.47లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. 


యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కన్సార్టియంతో పాటు బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, ఆర్‌ఈసీ లిమిటెడ్‌, పీఎ్‌ఫసీ నుంచి ఐడీసీ రుణాలు తీసుకుంటోంది. రుణాల చెల్లింపులు సకాలంలో చేస్తుండడం వల్లే ‘ఏప్లస్‌’ కేటగిరీ దక్కిందని ఐడీసీ ఎండీ బి.శంకర్‌ తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ సంస్థలకు ‘ఏ ప్లస్‌ప్లస్‌’, ‘ఏ ప్లస్‌’, ‘ఏ’ గ్రేడ్లను ఆర్‌ఈసీ ఇస్తోంది.


ఈనెల 20వ తేదీన ఆర్‌ఈసీ విడుదల చేసిన లోన్‌ పాలసీ సర్క్యులర్‌ ప్రకారం ‘ఏ ప్లస్‌ప్లస్‌’ గ్రేడ్‌ కలిగిన ప్రభుత్వ సంస్థలకు 9.50శాతం వార్షిక వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. ‘ఏ ప్లస్‌’ కేటగిరీలో సంస్థలకు 10.25శాతం, ‘ఏ’ కేటగిరీలో ఉన్న సంస్థలకు 10.50 శాతం వార్షిక వడ్డీతో రుణాలు లభిస్తాయి. మెరుగైన కేటగిరీలో ఉండడం వల్ల జాతీయస్థాయిలో రుణ పరపతి మెరుగుపడటమే కాకుండా.. తేలిగ్గా, తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయి.


Updated Date - 2022-01-25T07:49:48+05:30 IST