Hyderabad : రాజ్భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు
ABN , First Publish Date - 2021-07-16T16:21:15+05:30 IST
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం విదితమే
హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం విదితమే. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపుతో ‘చలో రాజ్భవన్’ కు బయల్దేరుతుండగా పలుచోట్ల ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలివెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే.. పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్ద హల్ చల్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి రాజ్ భవన్కు చేరుకుని రాజ్భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా.. చలో రాజ్భవన్ అడ్డుకుంటే పోలీస్స్టేషన్ను ముట్టడిస్తామని రేవంత్రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే.