భార్యను దుర్భాషలాడిన భర్త.. తనను తిడుతున్నాడని పక్కింటి వ్యక్తి అపోహ పడి..
ABN , First Publish Date - 2020-07-09T21:33:18+05:30 IST
ఓ వ్యక్తి తన భార్యతో రెండు రోజుల క్రితం గొడవ పడి దుర్భాషలాడాడు. పక్కింటి వ్యక్తి అది విని తననే తిడుతున్నాడేమోనని అపోహపడ్డాడు. తన బావమరుదులతో కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశాడు.
దాడి ఘటనలో ఒకరి మృతి
మృతదేహంతో కుటుంబ సభ్యుల నిరసన
ముగ్గురిపై కేసు నమోదు
మల్హర్ (ములుగు): ఓ వ్యక్తి తన భార్యతో రెండు రోజుల క్రితం గొడవ పడి దుర్భాషలాడాడు. పక్కింటి వ్యక్తి అది విని తననే తిడుతున్నాడేమోనని అపోహపడ్డాడు. తన బావమరుదులతో కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు మంగళవారం మృతిచెందాడు. దీంతో కోపోద్రిక్తులైన మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని మల్లారంలో చోటుచేసుకుంది. కొయ్యూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన రేవెల్లి రాజబాబు తన భార్యను దూషిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న దేవసాని శ్రీనివాస్ తననే తిడుతున్నాడని అపోహపడ్డాడు. రాజబాబుపై దాడి చేశాడు.
శ్రీనివాస్ తో పాటు అతడి బావమరుదులు కుసుమ శేఖర్, కుసుమ సంపత్ కూడా దాడి చేశారు. రాజబాబు తలకు బలమైన గాయం కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ రాజబాబు మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య లత ఇచ్చిన ఫి ర్యాదు మేరకు ముగ్గురిపై హత్య, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా రాజబాబు మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, కుల సంఘాల నేతలు శ్రీనివాస్ ఇంటి ఎదుట బుధవారం నిరసన తెలిపారు.