నేడు, రేపూ వానలు

ABN , First Publish Date - 2020-04-10T06:59:02+05:30 IST

విదర్భ నుంచి తమిళనాడు వరకు నెలకొన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రలో అనేక ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడిన అకాల వర్షం కురవగా...

నేడు, రేపూ వానలు

  • రాష్ట్ర రైతుల్లో ఆందోళన


అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):  విదర్భ నుంచి తమిళనాడు వరకు నెలకొన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రలో అనేక ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడిన అకాల వర్షం కురవగా.. శుక్ర, శనివారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా.. నెల్లూరు జిల్లాలో ఐదారు మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాయుడుపేటలో 102, గూడూరులో 100, ముత్తుకూరులో 82, మద్దిపాడులో 94.5 మిల్లీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా చెదురు మదురుగా జల్లులుపడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌ లేక.. గిట్టుబాటు ధర దొరక్క అల్లాడుతుంటే.. ఇప్పుడు కల్లాల్లో ఉన్న పంట కూడా తడిసిపోవడంతో నాణ్యత లేదంటూ వ్యాపారులు ధర తగ్గిస్తారేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి, అమ్ముకునే తరుణంలో పాడైన ఉత్పత్తి అమ్మాలంటే కష్టమని.. గిట్టుబాటు ధర రాకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.


కోస్తా, సీమలకు వర్షసూచన

ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పిడుగులతో పలుచోట్ల వర్షాలు  పడతాయని.. ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాగా.. ఉత్తరాదిలో పయనించే వెస్ట్రన్‌ డిస్టర్బెన్స్‌ ప్రభావంతో మధ్య భారతం నుంచి దక్షిణభారతం వరకు ద్రోణులు ఏర్పడుతుంటాయని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృ ష్ణ తెలిపారు. దీనికితోడు సము ద్రం నుంచి తేమగాలులు రావడంతో వర్షాలు కురుస్తుంటాయ ని వివరించారు. గురువారం దక్షిణకోస్తాలో సముద్రం   నుంచి వచ్చే తేమ కారణంగా మేఘాలు ఆవరించి భారీవర్షాలు కురిశాయన్నారు. రెండు, మూడు రోజులు ఈ వాతావరణం కొనసాగిన తర్వాత వర్షాలు తగ్గిపోతాయన్నారు.


Updated Date - 2020-04-10T06:59:02+05:30 IST