టూరిస్టులకు స్వాగతం పలుకుతున్న దుబాయి..!
ABN , First Publish Date - 2020-07-06T18:02:07+05:30 IST
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుమారు మూడు నెలల తర్వాత టూరిస్టులకు దుబాయి స్వాగతం పలుకుతోంది. జూలై 7 నుంచి టూరిస్టులను దు
దుబాయి: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుమారు మూడు నెలల తర్వాత టూరిస్టులకు దుబాయి స్వాగతం పలుకుతోంది. జూలై 7 నుంచి టూరిస్టులను దుబాయిలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసింది. కరోనా నేపథ్యంలో టూరిస్టులు సమర్పించాల్సిన పత్రాలను ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. క్వారెంటైన్ బాధలు లేకుండా దుబాయి అంతటా తిరగడానికి అవసరమైన పత్రాల కోసం ఒక్కసారి ఈ వార్తలోకి లుక్కేయండి. దుబాయికి వెళ్లే టూరిస్టులకు కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ప్రయాణానికి 96 గంటల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్లో టూరిస్ట్.. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ప్రయాణికుడు ఒకవేళ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించకపోతే.. దుబాయిలోని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో సదరు ప్రయాణికుడు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరీక్షా ఫలితాలు వచ్చే వరకు సదరు ప్రయాణికుడు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రయాణానికి ముందే టూరిస్ట్.. కరోనాకు వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. సదరు ప్రయాణికుడికి ట్రావెల్ ఇన్సూరెన్స్ లేనట్లయితే.. ఒకవేళ తమకు కొవిడ్ లక్షణాలు బయటపడితే.. దాని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామంటూ టూరిస్ట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టూరిస్ట్ జాతీయతను బట్టి.. దుబాయి, వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సౌకర్యం లేని దేశస్తులు ప్రయాణానికి ముందు దుబాయి ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో విజిట్ వీసా పొందాలి. అంతేకాకుండా ప్రయాణానికి ముందే టూరిస్టులు కొవిడ్-19 డీఎక్స్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టూరిస్ట్కు కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు దుబాయి అధికారలు భావిస్తే.. సదరు టూరిస్ట్కు ఎయిర్పోర్ట్లో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.