గృహాలకు మస్తు గిరాకీ
ABN , First Publish Date - 2021-10-05T07:54:36+05:30 IST
హైదరాబాద్లో గృహ విక్రయాలు కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి పుంజుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ఫ్రాంక్ వెల్ల డించింది.
హైదరాబాద్లో అమ్మకాలు మూడింతలు
ప్రీ-కొవిడ్ స్థాయికి విక్రయాలు
నైట్ ఫ్రాంక్ నివేదిక విడుదల
న్యూఢిల్లీ: హైదరాబాద్లో గృహ విక్రయాలు కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి పుంజుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ఫ్రాంక్ వెల్లడించింది. సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి నగరంలో గృహ విక్రయాలు 5,987 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది క్యూ3లో నమోదైన 1,609 యూనిట్లతో పోల్చితే, అమ్మకాలు మూడింతలకు పైగా పెరిగాయి. 2019 క్యూ3 పోల్చితే గడిచిన మూడు నెలల విక్రయాలు 147 శాతానికి సమానం. అంటే, హైదరాబాద్లో అమ్మకాలు ప్రీ-కొవిడ్ స్థాయి ని దాటేశాయన్నమాట. అంతేకాదు, నగరంలో 9,256 యూనిట్లు కలిగిన కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వార్షిక ప్రాతిపదికన 650 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్ల్లడించింది. హైదరాబాద్, చెన్నై, కోల్కతా మార్కెట్లలో ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన స్వల్పంగా పెరిగాయి. మిగతా మార్కెట్లలో మాత్రం దాదాపు స్థిరంగానే నమోదయ్యాయి.
ఇతర నగరాల్లోనూ అదే జోరు:
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 64,010 యూనిట్లకు పెరిగాయని నైట్ఫ్రాంక్ తెలిపింది. 2020 క్యూ3లో నమోదైన 33,403 యూనిట్లతో పోల్చితే, విక్రయాలు 92 శాతం, 2019 క్యూ3తో పోల్చితే 104 శాతం పెరిగాయని, తద్వారా మార్కెట్ ప్రీ-కొవిడ్ స్థాయికి చేరుకున్నట్లైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. ఇళ్ల ధరల్లో స్థిరత్వం, తక్కువ వడ్డీ కే ఇంటి రుణాలు, ప్రజల్లో సొంతింటిపై మోజు ఇందుకు దోహదపడిం దన్నారు. గడిచిన మూడు నెలలకు నమోదైన మొత్తం విక్రయాల్లో రూ.50 లక్షల లోపు ఖరీదు చేసే ప్రాపర్టీల వాటా 43 శాతానికి తగ్గింది. కాగా, రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన గృహాల వాటా 35 శాతానికి పెరిగింది.
‘ఆఫీస్ స్పేస్’లోనూ హైదరా‘బాద్షా’!
కార్యాలయ స్థలాల లీజులోనూ హైదరాబాద్ జోరుమీదున్నదని, జూలై-సెప్టెంబరు కాలంలో కంపెనీలు 21 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి కుదిరిన 5 లక్షల చదరపు అడుగుల ఒప్పందాలతో పోల్చితే, ఈసారి 363 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన మూడు నెలల్లో 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 38 శాతం తగ్గింది. 8 ప్రధాన నగరాల్లో 1.25 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే 2.5 రెట్లు అధికం.
జేఎల్ఎల్దీ అదే మాట
గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్ సహా 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 32,358 యూనిట్లకు పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి నమోదైన 14,415 యూనిట్లతో పోల్చితే, అమ్మకాలు రెండింతలకు పైగా పెరిగాయని అంటోంది. హైదరాబాద్లోనూ సేల్స్ రెండింతలకు పైగా వృద్ధి చెంది 4,418 యూనిట్లకు చేరుకున్నట్లు జేఎల్ఎల్ తెలిపింది.