ఐదేళ్లు ఆగక్కర్లేదు

ABN , First Publish Date - 2020-05-29T08:27:36+05:30 IST

టీడీపీ తిరిగి గద్దెనెక్కేందుకు ఐదేళ్లు ఆగక్కర్లేదని.. ఎన్టీఆర్‌ ఆశీర్వాదంతో తొందరలోనే మళ్లీ అధికారంలోకి...

ఐదేళ్లు ఆగక్కర్లేదు

ఎన్టీఆర్‌ ఆశీస్సులతో ముందే అధికారంలోకి: బాలకృష్ణ


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ తిరిగి గద్దెనెక్కేందుకు ఐదేళ్లు ఆగక్కర్లేదని.. ఎన్టీఆర్‌ ఆశీర్వాదంతో తొందరలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం మహానాడులో ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఎన్టీఆర్‌ జయంతి ప్రతి తెలుగువాడికి పండుగ రోజు. తెలుగుజాతి నిర్వీర్యమై దిక్కుతోచని పరిస్థితిలో.. అందరూ మద్రాసీలుగా పిలుస్తున్న సమయంలో ఆయన తెలుగువారికి గుర్తింపుతెచ్చారు. ఎన్‌ అంటే నటనాలయం. టీ అంటే తారామండలంలో ధ్రువతార. ఆర్‌ అంటే రాజకీయ దురంధరుడు. రాజర్షి. తెలుగు అన్న పదం వింటే నా త నువు పులకరిస్తుంది. ఎన్టీఆర్‌ అనే మాట వింటే మనసు ఉప్పొంగుతుంది. ఇది ప్రతి తెలుగువాడి భావన. చారిత్రక పురుషుడు ఎన్టీఆర్‌.


సినీ జీవితాన్ని వదిలేసి తనను ఇంతవాడిని చేసిన ప్రజల కోసం ఏదైనా చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేదోడికి కూడు, గూడు, గుడ్డ అందించారు. ఆడబిడ్డలకు ఆస్తిహక్కు కల్పించారు. ఎప్పుడో పండక్కి మాత్రమే తినే అన్నం పేదలు ప్రతిరోజు తినేలా చేశారు. నాకు ఎన్టీఆర్‌ తండ్రి మాత్రమే కాదు. గురువు.. దైవం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ తలచుకుంటే పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. ఆయన్ను అనుకరించడం కాదు. అనుసరించాలి. నేను కాదు ఎన్టీఆర్‌ వారసుడిని. తెలుగుదేశం కార్యకర్తలంతా ఆయన వారసులే. ఈ అరాచక పాలన అంతానికి ఐదేళ్లు అవసరం లేదు. ప్రజలే అరాచకశక్తులకు బుద్దిచెబుతారు’ అని బాలకృష్ణ ఉద్ఘాటించారు.

Updated Date - 2020-05-29T08:27:36+05:30 IST