అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-09T01:30:19+05:30 IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రక్తస్రావం జరుగుతున్నా.. 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని

అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి: మాజీమంత్రి అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రక్తస్రావం జరుగుతున్నా.. 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని, దర్యాప్తు అధికారి వ్యవహరించిన తీరు... అంతరాత్మ ఉన్న ఏ మనిషినైనా కదిలిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించారు. చికిత్స జరిగినట్లు తెలియదన్న వాదన నమ్మశక్యంగా లేదని కోర్టు తెలిపింది. కంటికి కన్ను, పంటికి పన్ను... అనే సిద్ధాంతం నుంచి... సమాజం చాలా దూరం వెళ్లిందనే విషయం గుర్తించకపోవడం దురదృష్టకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నేరం వేరు, పాపం వేరు... నేరం చేసిన వారికి హక్కులు లేవన్న వాదన సమర్ధనీయం కాదని కోర్టు తప్పుబట్టింది. తీవ్రమైన నేరం చేసిన వారికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఉంటాయని కోర్టు తెలిపింది. 


సుదూర ప్రయాణం చేయించడం వల్ల రెండో చికిత్స చేయాల్సి వచ్చిందని, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై స్పెషల్ జడ్జి దృష్టికి తీసుకువచ్చి... ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే జిల్లా జైలుకు తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, జూన్ 23, 24 తేదీలలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు విడుదల చేసిన బులెటిన్, రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు లేఖలు చూస్తే పిటిషనర్‌ను ఎలా ట్రీట్ చేశారో తెలిసిపోతుందని, కొలనోస్కోప్ చేసిన తర్వాత బయాప్సి నివేదిక రాకుండానే... అచ్చెన్నాయుడిని ఎందుకు డిశ్చార్జి చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2020-07-09T01:30:19+05:30 IST