Punch Prabhakar : జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-29T20:16:57+05:30 IST
జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ హైకోర్టు ఎదుట హాజరైనారు.
అమరావతి: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ హైకోర్టు ఎదుట హాజరైనారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్కు లేఖ రాశామని సీబీఐ చెప్పింది. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరపు న్యాయవాది చెప్పారు. ఫేస్బుక్, వాట్సప్ తరపున ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ హాజరైనారు. రిజిస్ట్రార్ జనరల్ విజ్ఞప్తి చేసిన వెంటనే పోస్టులు తొలగించాలని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్ చెప్పారు. పంచ్ ప్రభాకర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్ను ఎవరో నడిపిస్తున్నారని స్టాండింగ్ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది.
అనుచిత పోస్టులపై లేఖ వస్తే తొలగిస్తామని యూట్యూబ్ తరపు న్యాయవాదులు తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ తోకనే కట్ చేద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా.. పోస్టులు ఎందుకు ఆగడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్ దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్ను అరెస్ట్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎఫ్బీఐ, ఇంటర్పోల్ను సంప్రదించామని, గుర్తింపు దొరకడం లేదని సీబీఐ చెప్పింది. హైకోర్టుపై వ్యాఖ్యలు చేసినా పట్టుకోకపోతే సామాన్యుడి సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది.