వైసీపీ నేతలు నందిగం సురేష్, ఆమంచికి హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-05-26T22:53:59+05:30 IST

న్యాయమూర్తులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో...

వైసీపీ నేతలు నందిగం సురేష్, ఆమంచికి హైకోర్టు నోటీసులు

అమరావతి: న్యాయమూర్తులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు తీర్పులు, జడ్జిలను కించపరుస్తూ మీడియాలో మాట్లాడటంతో పాటు సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెట్టడంపై న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పులపై సోషల్‌ మీడియాలో, మీడియాలోనూ చేసిన వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం వారందరికీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశించింది.


బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌‌తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి, రవీందర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌రావు, గోపాలకృష్ణ, కిశోర్‌రెడ్డి, చందు రెడ్డి, శ్రీధర్‌రెడ్డి,  వెంకట సత్యనారాయణ, గంజి అర్జున్‌, రామాంజనేయ రెడ్డి, సతీష్‌కుమార్‌, కే.గౌతమి, లింగారెడ్డి, రవికుమార్‌, సమీర్‌ రాథోడ్‌, పి.శ్రీను, రమేష్‌ గుంట, చిరంజీవి, వెంకటరెడ్డి, రవిజగన్‌, మహేష్‌, ప్రదీప్‌కుమార్‌ రెడ్డి, భాను, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌, లింగారెడ్డి, రఘురామిరెడ్డి, నాగేంద్రకుమార్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. 


ఇక ఏపీ హైకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. జడ్జిలను కించపరుస్తూ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసే ధోరణిని కోర్టులు తీవ్రంగా పరిగణించాల్సిందేనని న్యాయనిపుణులు అంటున్నారు. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి, రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే పెడ ధోరణిని ఉపేక్షించరాదని చెబుతున్నారు. 


కాగా డాక్టర్ సుధాకర్ కేసును మే 22న ఏపీ హైకోర్టు.. సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తోపాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలివే...

  • డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు ముందుగా చంద్రబాబుకు ఎలా తెలిసింది
  • చంద్రబాబు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడో అర్ధమవుతోంది
  • చంద్రబాబు కాల్ డేటా బయటపెట్టి విచారించాలి


ఆమంచి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవే..

డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు

కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు

కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోంది

కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడిని

Updated Date - 2020-05-26T22:53:59+05:30 IST