వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!

ABN , First Publish Date - 2021-09-09T05:30:00+05:30 IST

ప్రకృతికి, మనిషికి విడదీయరాని అనుబంధం! మట్టి వినాయకుడికి, ఆ మట్టిలో పుట్టిన చెట్ల ఆకులకూ అంతే బంధముంది. వినాయక చవితి అంటే కేవలం పండుగే కాదు.. ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతిలో ఒదిగిపొమ్మనే గొప్ప సందేశముంది. పండుగ రోజు ఏకదంతుడికి 21 రకాల పత్రిలతో పూజ చేస్తారు. ఈ పూజ ఆధునిక తరాలకు పర్యావరణ అవగాహన పాఠం. వినాయక చతుర్ధి రోజున చేసే ‘పత్రిపూజ’లో కరోనాను నివారించే గుణాలున్నాయి...

వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!

ప్రకృతికి, మనిషికి విడదీయరాని అనుబంధం! మట్టి వినాయకుడికి, ఆ మట్టిలో పుట్టిన చెట్ల ఆకులకూ అంతే బంధముంది. వినాయక చవితి అంటే కేవలం పండుగే కాదు.. ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతిలో ఒదిగిపొమ్మనే గొప్ప సందేశముంది. పండుగ రోజు ఏకదంతుడికి 21 రకాల పత్రిలతో పూజ చేస్తారు. ఈ పూజ ఆధునిక తరాలకు పర్యావరణ అవగాహన పాఠం.  వినాయక చతుర్ధి రోజున చేసే ‘పత్రిపూజ’లో కరోనాను నివారించే గుణాలున్నాయి. ఆ విశేషాలే ఇవి... 


జమ్మి: జమ్మిచెట్టు ఆకులు వగరుగా ఉంటాయి. దంచి, నీళ్లలో వేసి మరగ కాచుకుని రోజూ 1 - 2 కప్పులు తాగుతుంటే ఊపిరి తిత్తుల సమస్యలు, కఫం, ఉబ్బసం, చర్మరోగాలు తగ్గుతాయి. షుగరు రోగులకు మంచిది. ఆక్సిజన్‌ అందకపోవడం వంటి సమస్యలు రావు.


మాచిపత్రి: మాచిపత్రి కరోనా కారణంగా ఏర్పడే జ్వరాల పైన, కీళ్లవాతం పైన పనిచేస్తుంది. మానసిక సంతోషాన్నిస్తుంది. మెదడు లక్షణాలను, జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఆకులను ఎండించిన పొడితో టీ కాచుకుని రెండుపూటలా తాగవచ్చు.

బృహతి (ముళ్లవంకాయ): ముళ్ల వంకాయ, తెల్లములక, వాకుడు, కంటకారి ఇలా దీన్ని పిలుస్తారు. కరోనా వ్యాధిలో కఫం, దగ్గు, ఉబ్బసం, ఆయాసాల్ని పోగొడుతుంది. 


బిల్వ (మారేడు): దీన్నే శ్రీఫలం అనీ అంటారు. దీని ఆకులు, కాయలు జీర్ణకోశ వ్యాధులపై పనిచేస్తాయి. ఆకుల్ని ఎండించి దంచిన పొడితో రెండు పూటలా టీ కాచుకు తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది కరోనా సమయంలో ఊపిరి తిత్తుల్ని కాపాడుతుంది. 


దూర్వా (గరిక): దీని వేళ్లను శుభ్రపరచి ఎండించి దంచిన పొడిని నీళ్లలో మరిగించి రెండుపూటలా త్రాగుతుంటే మూత్రపిండాల వ్యాధిలో డయాలసిస్‌ మీద ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది. కరోనా వ్యాధిలో ఈ గరిక వేళ్లు, దర్భవేళ్లు, చెరుకు వేళ్లతో గ్రీన్‌ టీ తాగితే, ఆయాసాన్ని కఫాన్ని తగ్గించి ప్రాణాపాయ స్థితిని నివారిస్తుంది.


బదరి (రేగు): దీని ఆకుల్ని గొంతు శ్రావ్యంగా ఉండేందుకు గాయకులు ఎక్కువగా వాడతారు. ఈ ఆకుల్ని ఎండించి దంచిన పొడిలో మూడోవంతు యష్టిచూర్ణం(ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది), కొద్దిగా సైంధవ లవణం కలిపి నీళ్లలో మరిగించి తాగితే కరోనా సమయంలో ఆయాసం, దగ్గు తగ్గుతాయి. గొంతు బాగుపడుతుంది. వేడి తగ్గుతుంది.


అపామార్గ (గలిజేరు): కఫం, నీరుపట్టటం, వాపులు, గుండెజబ్బులు, లివర్‌ వ్యాధుల్ని తగ్గించే ఔషధం. రక్తవృద్ధి నిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్లలో ఇది ఒకటి. ఆకుల్ని కాడల్ని ఎండించి నీళ్లలో మరిగించి తాగాలి.   

తులసి: కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని తగ్గించి ఊపిరితిత్తుల్ని కాపాడుతుంది. దీన్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీళ్లను తాగుతున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. గ్రీన్‌ టీలో తప్పనిసరిగా కలపవలసిన ద్రవ్యం. 




చూతపత్రం (మామిడాకులు): మావిచిగురు తినగానే కోయిల కూసేనా అన్నట్టు గొంతును, ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచే గుణం మామిడి చిగుళ్లకుంది. దగ్గు, జలుబు ఆయాసాల్ని తగ్గిస్తుంది. మామిడాకుల విస్తట్లో తింటే మంచిది. 

కరవీర (గన్నేరు): ఎర్రగన్నేరు పచ్చగన్నేరు రెండు రకాలూ మనకు ఎక్కువగా పెరుగుతాయి. శివాలయాల్లో తప్పనిసరిగా పెంచుతారు. పాముకాటుకు విరుగుడుగా దీని చెక్కని, ఆకుల్ని వాడతారు. ఆకులు నూరి, నూనెలో కలిపి చర్మవ్యాధుల్లో పట్టిస్తారు.


విష్ణుక్రాంత: పూలమొక్కగా పెరుగుతుంది. నీలంపూలు లేదా తెల్లనిపూలు పూస్తాయి. దీని ఆకులూ పూలను ఊపిరితిత్తుల వ్యాధుల్లో వాడతారు. కరోనా లక్షణాల మీద పనిచేస్తుంది. ఎండించి, దంచిన పొడిని టీ కాచుకుని రెండుపూటలా తాగవచ్చు. ఈ ఆకుల్ని ఎండించి పొగచుట్ట చుట్టి వెలిగించి ఆ పొగని తాగితే ఆయాసం, దగ్గు తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఓషధులతో ధూమపానం విధానం ఉంది.


దాడిమ (దానిమ్మ):  దీని పూలు, ఆకులు, పచ్చికాయలు వగరుగా ఉంటాయి. నీళ్లలో మరిగించి తాగటానికి వీలుగా ఉంటాయి. కరోనాలో జీర్ణకోశసమస్యలను దగ్గు, ఆయాసాన్ని, దంతాల్లోంచి రక్తం కారటం, అమీబియాసిస్‌, నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి. ఈ పొడిని మజ్జిగలో కలిపితాగితే మంచిది.


దేవదారు లేదా గోరింట: తెలుగు ప్రాంతాల్లో సర్వసాధారణంగా దొరికేది కాదు. దేవదారు దొరకనివారు గోరింటను వాడుకోవచ్చు. దీని ఆకులు, కొమ్మలు, పూలు  వైద్యానికి పనికొస్తాయి. అన్నింటినీ కలిపి ఎండించి దంచిన పొడిని వాడుకోవచ్చు. కరోనా లక్షణాలమీద వీటికి ప్రభావం ఉంది. జ్వరాలలో ఔషధంగా పనిచేస్తుంది. వేడిని తగ్గిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. దగ్గు ఆయాసాలను తగ్గించే మంచి ఔషధం ఇది.


మరువం: మంచి సువాసన గల మొక్క. మనసుకి సంతోషాన్నిస్తుంది. దీన్ని ఎండించి, దంచిన పొడి విష దోషాల్ని పోగొట్టే యాంటీ ఆక్సిడెండ్‌ గా పనిచేస్తుంది. కరోనా లక్షణాలలో తీసుకొదగిన ఔషధం. జీర్ణకోశాన్ని, ఊపిరితిత్తుల్ని బలోపేతం చేస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. 


సింధువార (వావిలి): నల్లవావిలి ఆకులకి ఆయాసాన్ని తగ్గించి ఊపిరితిత్తుల్ని బలసంపన్నం చేసే గుణం ఉంది. వాతం, జలుబు రాకుండా ఉంటుందని ఈ ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో బాలింతలకు స్నానం చేయిస్తారు. చెవిలో హోరు తగ్గటానికి దీని ఆకు రసాన్ని చెవిలో పోస్తే తగ్గుతుంది. రోజూ దీని ఆకులతో టీ తాగుతుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.


జాజిపత్రి:  ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌. కరోనా వ్యాధిలో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఆకులు, పూలను ఎండించి టీ కాచుకోవచ్చు.


గండకీపత్రం లేదా కామంచి ఆకులు: 

కరోనా సంహారక ఓషధుల్ల్లో కామంచి ముఖ్యమైంది. వాపుని, దగ్గుని, ఆయాసాన్ని తక్షణం తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది. జీర్ణకోశవ్యవస్థను బలసంపన్నం చేస్తుంది. కీళ్ల నొప్పులు, అల్సర్లు, గుండె లక్షణాలను తగ్గిస్తుంది. ఈ ఆకులు, కాయల్ని ఎండించి దంచిన పొడితో టీ కాచి, రెండు పూటలా తాగవచ్చు. 


అశ్వత్థపత్రం(రావి ఆకులు): రావి ఆకులు, మండల్ని ఎండించి దంచిన పొడిని కరోనా నివారకంగా వాడుకోవచ్చు. కరోనాలో జ్వరాలను తగ్గిస్తుంది. రావికాయలు లేదా పండ్లు దొరికితే వాటిని కూడా కలుపుకోండి. కరోనాలో దగ్గు, జలుబు ఆయాసాలను తగ్గిస్తుంది.


అర్జున(తెల్లమద్ది): కొమ్మల్ని, ఆకుల్ని మంటపెట్టి కాల్చి భస్మం చేసి, నీళ్లలో వేసి ఉంచితే తెల్లటి పొడి అడుగున దిగుతుంది. ఇది గొప్ప క్షారం. తాంబూలంలో సున్నానికి బదులుగా దీన్ని వాడతారు. కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది. కీళ్లవాతానికి మంచి ఔషధం. కరోనా వ్యాధిలో కనిపించే లక్షణాలన్నింటి మీదా దీనికి ప్రభావం ఉంది. మండల్ని, ఆకుల్ని దంచిన పొడితో టీ కాచుకుని తాగవచ్చు. చింతచెట్టు మండలతోనూ, ఉత్తరేణి మండలతో కూడా ఇలా భస్మం తయారు చేసి వాడతారు. ఇవన్నీ కరోనా నివారకాలే! 


అర్కపత్ర(జిల్లేడు ఆకులు/పూలు):  పచ్చి పువ్వుల్లో మిరియాలు వేసి మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి రెండు పూటలా ఒక్కొక్క మాత్ర మింగితే కరోనాలో ఆయాసం, ఇతర ఊపిరితిత్తుల లక్షణాలు తగ్గుతాయి. ఉబ్బసానికి ఇది మంచి చికిత్స. నిర్భయంగా వాడవచ్చు. మూర్ఛల జబ్బు కూడా తగ్గుతుంది. ఎండించిన పూలను దంచిన పొడిని నెయ్యివేసి కాచి, ఆ నేతిని అరచెంచా మోతాదులో రెండు పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది. కలరావ్యాధి కూడా తగ్గుతుంది. పూలు నిరపాయకరంగా పనిచేస్తాయి.

దత్తూర (ఉమ్మెత్త):  దీని ఆకుల్ని ఎండించి చుట్టలా చుట్టి వెలిగించి ఆ పొగని తాగితే ఉబ్బసం తగ్గుతుంది. గడ్డలు, వాపులు తగ్గుతాయి. ఆకుల్ని ఎండించి దంచిన పొడిని టీ లాగా కాచుకుని తాగవచ్చు. తక్కువ మోతాదులో తీసుకోవాలి. అతిగా తీసుకుంటే హాని చేస్తుంది.





Updated Date - 2021-09-09T05:30:00+05:30 IST