నేటి నుంచి భారీ వర్షాలు
ABN , First Publish Date - 2020-08-08T08:42:12+05:30 IST
ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మేఘాలు ఆవరించి, రుతుపవనాలు చురుగ్గా కదలనున్నందున వీటి ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. శనివారం ఉత్తరాంధ్ర, యానాంలోను, ఆదివారం ఉత్తరాంధ్ర, యానాంతో పాటు దక్షిణకోస్తాలోను, 10, 11 తేదీల్లో దక్షిణకోస్తా, సీమల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపాయి. కాగా, శుక్రవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.