దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ.. ఫేక్ అని తేల్చిన నివేదిక

ABN , First Publish Date - 2022-05-20T19:56:36+05:30 IST

దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ.. ఫేక్ అని తేల్చిన నివేదిక

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌ (Disha  Encounter) కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు (TG High Court) పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) వెల్లడించింది. సిర్పూర్‌కర్‌ కమిషన్‌ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు పంపించింది.


సిర్పూర్‌కర్ నివేదికలో గోప్యం ఏమి లేదు..

సిర్పూర్‌కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐని లాయర్‌ శ్యామ్‌దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏమి లేదని.. దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తాము కమిషన్ వేశామని.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు. దానికి అనుగుణంగానే ముందుకెళ్తామని సీజేఐ వెల్లడించింది. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ పేర్కొన్నారు. నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ స్పష్టం చేశారు. దిశా కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపించేశారు.


ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని తేల్చిన సిర్పూర్‌కర్‌ కమిషన్‌..

దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సిర్పూర్‌కర్‌ కమిషన్‌ సంచలన నివేదికను ఇచ్చింది. దిశ కేసులో ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని సిర్పూర్‌కర్‌ కమిషన్‌ తేల్చింది. 387 పేజీలతో సిర్పూర్‌కర్‌ కమిషన్‌ నివేదికను తయారు చేసింది. పోలీస్‌ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్‌ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్‌కౌంటర్‌ జరిగిందని సిర్పూర్‌కర్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్‌ పేర్కొంది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్‌లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్, జానకీరామ్, బాలురాథోడ్, శ్రీకాంత్‌ ఈ ఘటనకు పాల్పడ్డారని సిర్పూర్‌కర్‌ కమిషన్‌ వెల్లడించింది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్‌ స్పష్టం చేసింది.


ఇవి మూక దాడులు లాంటివే..

నివేదికలో సిర్పూర్‌కర్‌ కమిషన్‌ 16 సిఫార్సులు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఇవి మూక దాడులు లాంటివేనని సిర్పూర్‌కర్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. పోలీసులు శరీరానికి కెమెరాలు తగిలించుకోవాలని తెలిపింది. నేర దర్యాప్తు విభాగాన్ని శాంతిభద్రతల విభాగంతో వేరు చేయాలని సూచించింది.

Updated Date - 2022-05-20T19:56:36+05:30 IST