అతడే విలన్: ఆసీస్ స్టార్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్

ABN , First Publish Date - 2022-04-18T01:41:21+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు చివరి వరకు పోరాడి ఓడింది.

అతడే విలన్: ఆసీస్ స్టార్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు చివరి వరకు పోరాడి ఓడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో 66 పరుగులు చేసినప్పటికీ తర్వాతి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఢిల్లీ ఓటమిపై టీమిండియా మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ఆ జట్టు ఓటమికి ఆసీస్ స్టార్ మిచెల్ మార్షే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన వరకు అయితే అతడే విలన్‌ అని చెప్పుకొచ్చాడు.


మార్ష్ ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్ని 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులోనూ 11 డాట్ బాల్స్ ఉండడం గమనార్హం. వచ్చిన పరుగులన్నీ సింగిల్స్ రూపంలోనే వచ్చాయి. మార్ష్ మరీ అంత చెత్తగా ఆడకున్నా ఉన్నా, లేదంటే ఓ మ్యాచ్‌లో అశ్విన్ రిటైర్డ్ అవుట్ అయినట్టు మార్ష్ కూడా తన వికెట్‌ను త్యాగం చేసినా ఢిల్లీ గెలిచి  ఉండేదన్నాడు. వెనక బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా రన్‌రేట్ 14 వరకు ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. పంత్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయిందని అన్నాడు.


తన వరకు చెప్పాలంటే ఢిల్లీ ఓటమి పుణ్యం మార్షేనని, అతడే విలనని తేల్చి చెప్పాడు. అయితే, కెప్టెన్ రిషభ్‌పంత్ మాత్రం మార్ష్‌ను వెనకోసుకొచ్చాడు. ఓటమికి మార్ష్ కారణం కాదన్నాడు. అతడికిది తొలి మ్యాచ్ అని అన్నాడు. మిడిల్ ఓవర్లలో మరింత బాగా ఆడితే బాగుండేదని అన్నాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆ ఒక్క ఓవరే మ్యాచ్‌ను మలుపుతిప్పిందన్నాడు.

Updated Date - 2022-04-18T01:41:21+05:30 IST