పెళ్లి కావడం లేదని తండ్రిని చంపేశాడు
ABN , First Publish Date - 2022-08-13T08:02:30+05:30 IST
పెళ్లి కావడం లేదని తండ్రిని చంపేశాడు
అడ్డొచ్చిన బాబాయ్నీ హత్య చేసిన ఉన్మాది.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో దారుణం
మోపాల్, ఆగస్టు 12 : తనకు 30 ఏళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేయడం లేదన్న కోపంతో కన్న తండ్రిని పారతో కొట్టి చంపేశాడు ఓ ఉన్మాది. అడ్డు వచ్చిన బాబాయ్ని కూడా అదే పారతో అంతం చేశాడు. నిజామాబాద్ జిల్లా మోపాల్లో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన అబ్బయ్య(62) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు సతీశ్ రెండేళ్ల క్రితమే దుబాయ్ నుంచి మోపాల్కు తిరిగొచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్నాడు. అయితే పెద్ద కుమారుడు మోహన్కు దుబాయ్లో మంచి వేతనం ఉండడంతో ఐదేళ్ల క్రితమే అబ్బయ్య అతడి పెళ్లి చేశారు. అప్పటి నుంచి తనకు కూడా పెళ్లి చేయాలని సతీశ్ తండ్రిని వేధిస్తున్నాడు. అయితే సతీశ్ పనీ పాట లేకుండా ఖాళీగా ఉంటుండటంతో.. అతడికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తనకు ఎందుకు పెళ్లి చేయడం లేదని, సంబంధాలు ఎందుకు చూడడం లేదని నిత్యం తల్లిదండ్రులతో సతీశ్ గొడవ పడేవాడు. ఈ విషయంలో శుక్రవారం తెల్లవారుజామున కూడా తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేయాలని, లేకుంటే అంతు చూస్తానని తండ్రిని సతీశ్ బెదిరించాడు. పని చేసుకుంటేనే ఎవరైనా పిల్లను ఇస్తారని, లేకుంటే ఎవరిస్తారని అబ్బయ్య ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన సతీశ్ పక్కనే ఉన్న పారతో తండ్రిపై దాడి చేశాడు. ఆ దెబ్బకు ఆయన కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న బాబాయి నడిపి సాయిలు అడ్డు రాగా.. ఆయననూ గట్టిగా కొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అబ్బయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, సాయంత్రం సతీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.