IPL 2021: హసరంగ, చమీరకు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-08-30T01:33:00+05:30 IST
యూఏఈలో త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2లో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు వనిందు హసరంగ,
కొలంబో: యూఏఈలో త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2లో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు వనిందు హసరంగ, దుషమంత చమీరకు అనుమతి లభించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేసింది. అయితే, టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో వామప్ గేమ్స్కు గాను అక్టోబరు 10వ తేదీ నాటికి తిరిగి జట్టులో చేరాల్సి ఉంటుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే, టీ20 సిరీస్ అనంతరం వీరిద్దరూ తమ ఫ్రాంచైజీలో చేరొచ్చని ఎస్ఎల్సీ పేర్కొంది.
భారత్లో కరోనా రెండో దశ కారణంగా అర్ధంతరంగా ఆగపోయిన ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో జరగనుంది. ఆ తర్వాత యూఏఈ, ఒమన్లు టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తాయి. ఇది అక్టోబరు 17 నుంచి 14 వరకు జరుగుతుంది. టీ20 ప్రపంచకప్ కూడా భారత్లోనే జరగాల్సి ఉండగా యూఏఈకి తరలిపోయింది.
ఆల్రౌండర్ వనిందు హసరంగ, ఫాస్ట్ బౌలర్ దుషమంత్ చమీర ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆర్సీబీ యాజమాన్యం ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫిన్ అలెన్, స్కాట్ కగ్గెలీన్లు బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపిక కాగా, ఆడం జంపా, డేనియల్ శామ్స్, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ రెండో దశకు అందుబాటులో ఉండబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భర్తీని ప్రారంభించిన ఆర్సీబీ వీరితో ఒప్పందం కుదుర్చుకుంది.