దుబ్బాక ఫలితాలపై జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-11-10T18:54:59+05:30 IST
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు..
న్యూఢిల్లీ: తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి రఘునందన్రావు విజయం దిశగా దూసుకువెళుతున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 రౌండ్లు పూర్తికాగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. దీని బట్టి చూస్తే దేశ నలుమూలల.. దక్షిణాది, ఉత్తరాది, పశ్చిమ పూర్వ, ఉత్తర పూర్వ ప్రాంతాలన్నింటిలో బీజేపీ హవా నడుస్తోందన్నారు. మోదీ నాయకత్వానికి దేశ ప్రజలు మరొక్కసారి మద్దతుగా నిలిచారన్నారు. బీజేపీ పెద్దగా బలంగా లేని రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు.
బీహార్లో భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్గా ఆవిర్భవిస్తోందని జీవీఎల్ అన్నారు. 73 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. తమను తక్కువ అంచనా వేసేవారు. ఏయే రాష్ట్రాల్లో పెద్దగా ఉనికిలేదని భావించే రాజకీయ పార్టీలు ఒక్కసారి లెక్కలు వేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గొప్ప శక్తిగా ఎదగటానికి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని జీవీఎల్ వ్యాఖ్యానించారు.