జీఎస్‌టీ వసూళ్లు అదుర్స్‌

ABN , First Publish Date - 2022-08-02T08:43:11+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో జోరు కొనసాగుతోంది. గత నెల (జూలై) వసూళ్లు రూ.1,48,995 కోట్లకు చేరాయి.

జీఎస్‌టీ వసూళ్లు అదుర్స్‌

 జూలైలో రూ.1.49 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో జోరు కొనసాగుతోంది. గత నెల (జూలై) వసూళ్లు రూ.1,48,995 కోట్లకు చేరాయి. మార్కెట్‌ వర్గాలు అంచనా వేసిన రూ.1.45 లక్షల కోట్లతో పోల్చినా ఇది దాదాపు రూ.3,995 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వసూలైౖన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత జీఎస్‌టీ పద్దు కింద ఇంత భారీ స్థాయిలో ఆదాయం లభించడం ఇది రెండోసారి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.1,16,393 కోట్లతో పోల్చినా ఈ జూలైలో జీఎ్‌సటీ వసూళ్లు 28 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతలకు చెక్‌ పెట్టడం ఇందుకు ప్రధాన కారణమని అధికార వర్గాలు చెప్పాయి. జూలైలో సీజీఎ్‌సటీ ద్వారా రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూ.32,807 కోట్లు, ఐజీఎ్‌సటీ రూ.79,518 కోట్లు, సెస్‌ ద్వారా రూ.10,920 కోట్లు వసూలయ్యాయి.


ఆరోసారి:

జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తర్వాత నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు మించిపోవడం ఇది ఆరోసారి. ఈ ఏడాది మార్చి నుంచి చూసినా జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రూ.1.40 లక్షల కోట్లు మించి పోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) జీఎ్‌సటీ వసూళ్లు నెలకు సగటున రూ.1.15 లక్షల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. అయితే ఆర్థిక పరిస్థితులు కుదుటపడడంతో ఈ మొత్తం రూ.1.45 లక్షల కోట్ల వరకు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 


తెలంగాణలో రూ.4,547 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వస్తు సేవల పన్ను (జీఎ్‌సటీ) వసూళ్లలో గణనీయ వృద్ధి నమోదైంది. జూలై నెలలో ఏకంగా రూ.4,547 కోట్ల జీఎ స్‌టీ వసూలైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం అన్ని రాష్ట్రాల జీఎ్‌సటీ వివరాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి జూలైలో రూ.4,547 కోట్ల జీఎస్‌టీ వసూలైందని తెలిపింది. గతేడాది ఇదే జూలైలో రాష్ట్రం నుంచి రూ.3,610 కోట్లు వసూలయ్యాయి. అంటే.. ఈసారి రాష్ట్రంలో 26 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ జీఎ్‌సటీ వసూళ్లు రూ.3,409 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే జూలైలో వసూళ్లు రూ.2,730 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. ఏపీలో 25 శాతం మేర వృద్ధి నమోదైనట్లు ప్రకటించింది. 

Updated Date - 2022-08-02T08:43:11+05:30 IST