తెలంగాణకు ‘మహా’ గండం!
ABN , First Publish Date - 2021-04-19T08:53:14+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఆకస్మికంగా రాష్ట్రంలో వేగంగా కేసుల పెరుగుదలకు దారితీసిన ప్రధాన కారణమేంటి...
- విదర్భ ప్రాంత జిల్లాల నుంచి రాష్ట్రంలోకి
- ‘డబుల్ మ్యుటెంట్’ వేరియంట్ ?
- సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసులు పైపైకి
- కొత్త వేరియంట్పై ‘సీసీఎంబీ’ పరిశోధనలు
- బి.1.617 వేరియంట్పై ‘సీసీఎంబీ’ పరిశోధనలు
- దానిలోని రెండు జన్యుమార్పుల గుట్టువిప్పడమే లక్ష్యం
- 2 వారాల్లోగా అధ్యయన ఫలితాలు
హైదరాబాద్/ముంబై, ఏప్రిల్ 18: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఆకస్మికంగా రాష్ట్రంలో వేగంగా కేసుల పెరుగుదలకు దారితీసిన ప్రధాన కారణమేంటి? అనే ప్రశ్నను లేవనెత్తే అందరి దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపైకే మళ్లుతోంది. అక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ‘డబుల్ మ్యుటెంట్’ (బి.1.617) కరోనా వైరస్ వేరియంట్వే ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జినోమిక్ కన్సార్టియం’ (ఐఎన్ఎ్సఏసీఓజీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకించి తెలంగాణను ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతంలో ఈ వేరియంట్కు సంబంధించిన కేసులు భారీగా నిర్ధారణ అవుతున్నాయి. ఆ ప్రాంతం పరిధిలోని గడ్చిరోలి, చంద్రాపూర్, యావత్మల్, నాందేడ్, ధర్మాబాద్, దేగ్లూర్ సహా పలు పట్టణాల నుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల మధ్య నిరంతరం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలోనే అత్యంత వేగంగా వ్యాపించే స్వభావం కలిగిన బి.1.617 వేరియంట్ మహారాష్ట్ర సరిహద్దుల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్ల జన్యుక్రమాలను హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు విశ్లేషించగా.. 2 శాతం కేసుల్లో ‘డబుల్ మ్యుటెంట్’ వేరియంట్ను గుర్తించారు. రాష్ట్రంలో చాపకింద నీరులా ఆ స్ట్రెయిన్ ప్రబలుతోంది అనేందుకు వైద్యనిపుణులు ఈ గణాంకాలను నిదర్శనంగా చూపుతున్నారు. పకడ్బందీగా కరోనా కట్టడి చర్యలు చేపట్టకపోతే రాష్ట్రాల మధ్య కరోనా వేరియంట్ల వ్యాప్తి మరింత వేగాన్ని పుంజుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు అకస్మాత్తుగా పెరగడానికి కూడా డబుల్ మ్యుటెంట్ వేరియంటే కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
అధ్యయనం మొదలైంది..
‘డబుల్ మ్యుటెంట్’ కరోనా వైరస్ ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమైందా? దేశంలో కేసులు భారీగా పెరగడానికి కారణం అదేనా? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నడుంబిగించింది. బి.1.617 వేరియంట్ జన్యువుల్లో దాగిన మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు ముమ్మర పరిశోధనలను నిర్వహిస్తోంది. ఒకటి లేదా రెండు వారాల్లోనే అధ్యయన ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. బి.1.617 వేరియంట్ను ‘డబుల్ మ్యుటెంట్’ అని పిలువడం సరికాదని, ఎందుకంటే ప్రస్తుతం వ్యాప్తిలో ఎన్నో కరోనా వేరియంట్లలోనూ ఒకటికి మించి మ్యుటేషన్లు(జన్యుమార్పులు) సంభవించాయని చెప్పారు. ‘ఈ484క్యూ’, ‘ఎల్452ఆర్’ జన్యుమార్పులే బి.1.617వేరియంట్ను ప్రమాదకరంగా మార్చాయా?లేదా? ఈ దిశగా పరిశోధనలుంటాయన్నారు.