నాబార్డు చైర్మన్గా గోవిందరాజులు
ABN , First Publish Date - 2020-02-20T09:25:10+05:30 IST
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చైర్మన్ పదవి తెలుగు తేజాన్ని వరించనుంది. కీలకమైన ఈ పదవికి
- సిఫారసు చేసిన బ్యాంక్స్ బోర్డు బ్యూరో
- 24 ఏళ్ల తరువాత తెలుగు వ్యక్తికి అవకాశం
- గుంటూరు జిల్లావాసికి అరుదైన గౌరవం
- ప్రస్తుతం నాబార్డు డిప్యూటీ ఎండీగా విధులు
హైదరాబాద్/గుంటూరు/అమరావతి(ఆంధ్రజ్యోతి): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చైర్మన్ పదవి తెలుగు తేజాన్ని వరించనుంది. కీలకమైన ఈ పదవికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన చింతల గోవిందరాజులు నియమితులు కానున్నారు. ఈ పదవికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి 18 మంది పేర్లు బోర్డు పరిశీలనకు రాగా.. ఇంటర్వ్యూలు, కసరత్తు అనంతరం గోవిందరాజులు పేరును సిఫారసు చేస్తూ బ్యాంక్స్ బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అరుదైన అవకాశం ఓ తెలుగు వ్యక్తికి 24 ఏళ్ల తరువాత లభించినట్లయింది. 24 ఏళ్ల క్రితం తెలుగువారైన కోటయ్య ఈ సంస్థకు చైర్మన్గా వ్యవహరించారు. కాగా, కొంతకాలంగా నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న చింతల గోవిందరాజులు.. పాఠశాల, కళాశాల విద్య గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో, జేకేసీ కళాశాలలో అభ్యసించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐఏఆర్ఐలో సీడ్ టెక్నాలజీ విభాగంలో పీజీ చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్-బి అధికారిగా చేరారు. గడిచిన 35 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లఖ్నవూలోని బీఐఆర్డీ డైరెక్టర్గా, న్యాబ్ఫిన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు.