సర్కారు వాటా సమర్పయామి
ABN , First Publish Date - 2021-05-08T08:38:18+05:30 IST
గంగవరం పోర్టు సంపూర్ణంగా అదానీ కంపెనీ వశమైనట్లే. ఇప్పటికే వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు కుటుం బం నుంచి అదానీ సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్
‘గంగవరం’లో ఏపీ వాటా కూడా అదానీకే
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): గంగవరం పోర్టు సంపూర్ణంగా అదానీ కంపెనీ వశమైనట్లే. ఇప్పటికే వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు కుటుం బం నుంచి అదానీ సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకున్న 10.39 వాటాల ను కూడా అదానీకి సమర్పించేసింది. మూడు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. 10.39 శాతం వాటాకు రూ.645 కోట్లు ఇవ్వడానికి అదానీ ముందుకు వచ్చినట్లు సమాచారం.
వాస్తవానికి గంగవరం పోర్టుకు ఉన్న 2100 ఎకరాల్లో 1400 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చినవే. అందుకుగాను పోర్టులో ప్రభుత్వానికి 10.39 శాతం వాటా ఇచ్చారు. ప్రస్తుతం గంగవరం పోర్టు రూ.500 కోట్ల లాభాల్లో ఉంది. ఏటా రూ.20 నుంచి రూ.25 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. గంగవరంపరిసరాల్లో ఇప్పుడు ఎకరా భూమి రూ.5 కోట్లు పలుకుతోంది. అంటే... ప్రభుత్వ వాటా భూమి 1400 ఎకరాల విలువ రూ.7 వేల కోట్లు! అంత విలువైన వాటాను కేవలం రూ.645 కోట్లకు అదానీకి కట్టబెట్టడంపై ఇప్పుడు విస్మయం వ్యక్తమవుతోంది.