రెవెన్యూలో సర్దుబాటు చేశాకే ఇతర శాఖల్లోకి..!

ABN , First Publish Date - 2020-09-17T07:44:31+05:30 IST

జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత రెవెన్యూ శాఖలో ఏర్పడిన ఖాళీల్లో వీఆర్వోలు,

రెవెన్యూలో సర్దుబాటు చేశాకే ఇతర శాఖల్లోకి..!

  • వీఆర్వో, వీఆర్‌ఏల విషయంలో ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత రెవెన్యూ శాఖలో ఏర్పడిన ఖాళీల్లో వీఆర్వోలు, వీఆర్‌ఏలను సర్దుబాటు చేశాక మిగిలిన వారిని ఇతర శాఖల్లోకి పంపించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో 5,657 వీఆర్వోల పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ చట్టం తెచ్చిన విషయం విదితమే. వీఆర్‌ఏలకు కూడా పే స్కేలు ఇచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారు. గ్రామానికి ఒక వీఆర్‌ఏ లేకుంటే ఇబ్బందులొస్తాయని రెవెన్యూ సంఘాలు కూడా ప్రభుత్వానికి నివేదించిన విషయం విదితమే. దాంతో ప్రతీ గ్రామంలో ఒక వీఆర్‌ఏను పెడతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ శాసన మండలిలోనూ ఈ మేరకు ప్రకటన చేశారు. దాంతో వీఆర్‌ఏల్లో 80 శాతానికి పైగా రెవెన్యూ శాఖల్లోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 11 వేల రెవెన్యూ గ్రామాలు, 20 వేలకు పైగా ఇతర గ్రామాలు ఉన్నాయి. దాంతో జనాభా లేదా భూముల విస్తీర్ణం ప్రాతిపదికన వీఆర్‌ఏలను తహసీల్దార్‌కు సాయంగా ఉండేలా గ్రామాల్లో నియమిస్తారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఏ సంఘటన జరిగినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం వంటి బాధ్యతలను వీఆర్‌ఏలు చూస్తారు.  

ఖాళీలను గుర్తించాకే ఆప్షన్లు

వీఆర్వో, వీఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి పంపించే ముందు ఆయా శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి లేదా ఆఫీస్‌ సబార్డినేట్‌ ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఆ తర్వాతే ఇతర శాఖల్లోకి వెళ్లడానికి వీరి ఆప్షన్లు తీసుకోనున్నారు. దీనికి నెల రోజులు పడుతుందని అంచనా. 

Updated Date - 2020-09-17T07:44:31+05:30 IST